సిద్దిపేట, ఫిబ్రవరి 2 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్య రాష్ట్రంలో కొందరికే పింఛన్లు వచ్చేవి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులతో పాటు ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులను అకున చేర్చుకొని కేసీఆర్ ప్రభుత్వం పింఛన్లు ఇచ్చింది. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.200, దివ్యాంగులకు రూ.500 పింఛన్ మాత్రమే ఇచ్చాయి. కేసీఆర్ నెలనెలా దివ్యాంగులకు రూ.4016, మిగతా వర్గాలకు రూ.2016 అందించారు.
సిద్దిపేట జిల్లాలో 1,91,185 మంది లబ్ధిదారులకు రూ.41,39,02,960, మెదక్ జిల్లాలో 1,16,728 మంది లబ్ధిదారులకు రూ. 25,24,39,648, సంగారెడ్డి జిల్లాలో 1,61,662 మంది లబ్ధిదారులకు ప్రతినెలా రూ. 35,58,90,592 చెల్లించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాం లో ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నిరకాల పింఛన్లు కలుపుకొని మొత్తం 4,69,575 మంది లబ్ధిదారులున్నారు. వీరిలో 1,6 4,405 మంది వృద్ధ్దాప్య, 1,74,940 మంది వితంతువులు, 37,785 మంది దివ్యాంగులు, 4,814 మంది గీత కార్మికులు, 3,525 మంది చేనేత కార్మికులు, 3,107 మంది హెచ్ఐవీ బాధితులు, 3, 448 మంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, 339 మంది డయాలసిస్ బాధితులు, 300 మంది బీడీ టేకేదారులు, 41,608 మంది బీడీ కార్మికులు, 15,304 మంది ఒంటరి మహిళలు ఉన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా రూ.102.22 కోట్లను లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమచేసింది. ఇందులో దివ్యాంగులు 37,785 మంది ఉన్నారు.వీరికోసం ప్రతినెలా ఒక్కొక్కరికి రూ.4,016 చొప్పున రూ.15,17, 44,560 జమ చేసింది. మిగతా వర్గాల వారు 4,31,790 మందికి మొత్తం రూ.87,04,88,640 కోట్లు చెల్లించిం ది. సిద్దిపేట జిల్లాలో ప్రతినెలా 1,91, 185 మంది లబ్ధిదారులకు రూ.41.39 కోట్లు, వీరిలో 14,237 మంది దివ్యాంగులకు ప్రతినెలా రూ.5,71,75,792, మిగతా వర్గాలు 1,76,948 మంది లబ్ధిదారులకు రూ. 35,67,27,168 కోట్లు చెల్లించింది. మెదక్ జిల్లాలో ప్రతి నెలా 1,16,728 లబ్ధిదారులకు రూ. 25.24కోట్లు చెల్లించారు. వీరిలో దివ్యాంగులు 8,558 మంది రూ. 3,43,68,928, మిగతా వర్గాల వారు 1,08,170 మందికి రూ.21,80, 70,720, సంగారెడ్డి జిల్లాలో ప్రతినెలా 1.61,662 మందికి రూ.35.58 కోట్లు , వీరిలో 14,990 మంది దివ్యాంగులకు రూ. 6,01,99,840, మిగతా వర్గాల వారు 1,46,672 మందికి రూ. 29,56,90,752 కోట్లను లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ప్రతినెలా జమచేసింది.
ఆసరా పింఛన్ కోసం పండుటాకులు ఎదురుచూపులు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ నెల పింఛన్ ఆ నెల ఠక్కున వచ్చేది. ప్రతినెలా మొదటి వారంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో పింఛన్ జమయ్యేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్, జనవరి నెలల పింఛన్లకు ఇంకా దిక్కులేదు. మరో వారం రోజులు గడిస్తే ఫిబ్రవరి పింఛన్లు కూడా వేయాల్సి ఉంది. జిల్లా యూనిట్గా పింఛన్లు విడుదల చేయడం లేదు. కొన్ని మండలాల్లో ముందుగా, మరికొన్ని మండలాల్లో ఆలస్యంగా విడుదల చేస్తుండడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని తపాలా కార్యాలయాల పరిధిలో శుక్రవారం నుంచి డిసెంబర్ పింఛన్లు విడుదలయ్యాయి.దీంతో అక్కడ పింఛన్లు అందిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి ఇంకా అందలేదు. దీంతో పింఛన్ డబ్బుల కోసం పండుటాకులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఎదురు చూపులే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఆసరా పింఛన్ లబ్ధిదారులు, రైతులు, కొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు ఎదురుచూపులే దిక్కవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఠంఛన్గా ప్రతినెలా ఆసరా పింఛన్లు వస్తుండే. సెల్ఫోన్కు మెసేజ్రాగానే నేరుగా బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకునేవారు. అప్పుడు ఎలాంటి రంది లేకుండే. ఇక రైతుల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. యాసంగి పంట సాగు ప్రారంభం కాగానే కేసీఆర్ ప్రభుత్వం డిసెంబర్ చివరి నుంచి జనవరి సంక్రాంతి పండుగ వరకు అందరికీ రైతుబంధు నేరుగా రైతుల బ్యాంకుఖాతాలో డబ్బులు జమచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుబంధు ఇంకా పూర్తిస్థాయిలో పడలేదు.
కేసీఆర్ సారు బీడీ కార్మికులకు ఆసరా పింఛన్ మంజూరు చేసి అండగా నిలిచారు. గత బీఆర్ఎస్ సర్కారులో నెలనెలా బ్యాంకులో పింఛన్ డబ్బులు పడేది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పింఛన్ కోసం నెలల తరబడి వేచి చూస్తున్నాం. జనవరి నెల పింఛన్ ఇప్పటి వరకు పడలేదు. కిరాణం, ఇతర సామగ్రి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలో కాంగ్రెస్ ఆసరా పింఛన్ రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పెంచలేదు.
సిద్దిపేట, ఫిబ్రవరి 2: వృద్ధులు, దివ్యాంగులు ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫిబ్రవరి నెల కొనసాగుతున్నా నేటికీ జనవరి నెలకు సంబంధించిన పింఛన్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయలేదు. లబ్ధిదారులకు పింఛన్లు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చేయూత పథకం ద్వారా గత డిసెంబర్ నుంచి రూ.4 వేల పింఛన్ ఇస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడేమో సమయానికి కనీసం రూ.2 వేలు కూడా ఇవ్వకపోవడం విడ్డూరం. రూ. 200 ఉన్న పింఛన్ రూ.2000 లకు పెంచి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా కల్పించారు. ప్రస్తుతం ఆసరా డబ్బులు ఆలస్యం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన పదేండ్లలో పింఛన్ కోసం లబ్ధిదారులు రోడ్డెకి ఆందోళనలు చేసిన ఘటనలు లేవు. తక్షణమే జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలి.