నర్సాపూర్, మే18: కంటి వెలుగు కార్యక్రమం ఇంటికే వెలుగులాంటిదని, కంటి చూపు పట్ల అశ్రద్ధ చేయకుండా ప్రతిఒక్కరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం మండలంలోని చిన్నచింతకుంట గ్రామంలో కంటి వెలుగు శిబిరం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం, నర్సాపూర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెద్దచింతకుంటలో రైస్మిల్లును కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 79 రోజుల నుంచి నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తున్నదన్నారు. జూన్ 15 వరకు కొనసాగనున్న ఈ శిబిరాలను 18 ఏళ్ల పై బడిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరు, రికార్డులు, కండ్లద్దాలు, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 415 జీపీలు, 73 వార్డుల్లో ఈ శిబిరాలు నిర్వహించి 4,17,365 మందికి పరీక్షలు చేశారన్నారు. 44,308 మందికి రీడింగ్, 34,093 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు అందజేశామన్నారు. మరో 11,707 మందికి త్వరలో అందజేయనున్నామని వెల్లడించారు.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
చిన్నచింతకుంట గ్రామంలోని వైకుంఠధామాన్ని పరిశీలించి బోర్ పంపుసెట్కు వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించి వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. డంపింగ్ యార్డ్ను పరిశీలించి తడి, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు పొడి చెత్తను ఎరువుగా విక్రయించి, పంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవాలన్నారు. వానకాలానికి ముందే గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టేందుకు ప్రభుత్వం వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సైడ్ డ్రైన్స్ క్లీనింగ్ పనులు పరిశీలించారు. ఆ తర్వాత నర్సరీని పరిశీలించి అవెన్యూ ప్లాంటేషన్కు టేకోమా, కానుగ వంటి పెద్ద మొక్కలు లేకపోవడాన్ని గమనించి పక్క నర్సరీల నుంచి సేకరించాలని సూచించారు.
ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీకి పెంచుతున్న పండ్లు, పూలమొక్కలను పరిశీలించారు. అనంతరం నర్సాపూర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. పనులు వేగవంతం చేసి సెప్టెంబర్ నాటికి 224 ఇండ్లు పూర్తి చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని పీఆర్ ఈఈని ఆదేశించారు. ఆ తర్వాత పెద్దచింతకుంట గ్రామంలోని మహాలక్ష్మి రైస్మిల్ను సందర్శించి పెండింగ్లో ఉన్న సీఎంఆర్ రైస్ను రోజూ 170 మెట్రిక్ టన్నుల చొప్పున ఈ నెలాఖరు వరకు ఎఫ్సీఐకి తరలించాలని యాజమాన్యానికి ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చందునాయక్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో సాయిబాబా, పీఆర్ఈఈ సత్యనారాయణరెడ్డి, డిఫ్యూ టీ డీఎంహెచ్వో విజయనిర్మల, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో మార్టిన్ లూథర్, సర్పంచ్ సురేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.