సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 20: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శనివారం మూడోరోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇప్పటికే నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేయగా, తాజాగా మరో నలుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతికి అందజేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డితో కలిసి బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్కుమార్ నామినేషన్ వేశారు. అనంతరం జహీరాబాద్ ఎమ్మెల్యే కొణింటి మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, భూపాల్రెడ్డి తదితరులు అనిల్కుమార్ తరఫున మరోసెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రవీణ్, కొత్త బలిజ బస్వరాజ్, రామారావు పాటిల్ ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ రెండోరోజు వేసిన స్వతంత్ర అభ్యర్థి మారుతిరావు, మూడోరోజు మరో సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. దీంతో జహీరాబాద్ స్థానానికి ఇప్పటివరకు 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇందులో గాలి అనిల్ కుమార్, మారుతిరావు, మహాదేవ్ స్వామి రెండు సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.