సిద్దిపేట, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని చిన్నచూపు చూసిండ్రు.అప్పటి పాలకులు రైతుల కోసం ఆలోచన చేయలేదు. రైతుల బాధలను అవహేళన చేశారు. వ్యవసాయం దండుగ అంటూ చిత్రీకరించారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పాటుపడుతూ.. వ్యవసాయాన్ని పండుగలా చేశారు. ఇవాళ ఇదే తెలంగాణ నేడు సగం భారతదేశానికి అన్నం పెడుతున్నది. ఇది కలలో కూడా ఊహించి ఉండము. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని ప్రతి రైతు కండ్లల్లో సంతోషాన్ని నింపుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరంతో గోదావరి జలాలను సిద్దిపేట జిల్లాలో గ్రామగ్రామాన పారాయి. ఇవాళ ఎక్కడ చూసినా నిండుకుండలా చెరువులు కనిపిస్తున్నాయి.
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. ఫలితంగా ఒక పంటకు కూడా అనువుగా లేని భూముల్లో రెండు పంటలు పండిస్తున్న పరిస్థితి నేడు జిల్లాలో ఆవిష్కృతమైంది. తెలంగాణ రాకముందు 2013వ సంవత్సరంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 79,539 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించగా.. 2022 సంవత్సరంలో 16లక్షల 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఆనాడు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో కేవలం 104 కోట్లను జమ చేయగా ప్రస్తుతం 15వందల 26కోట్ల రూపాయలను రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించింది. ఇటు పంట దిగుబడిలో,అటు రైతుల ఆదాయంలో పదింతల ప్రగతిని సాధించాం. ఇది చారిత్రాత్మకమైన విజయంగా చెప్పుకోవాలి. రాళ్లు, రప్పల భూముల రూపురేఖలు మారిపోయి పచ్చని మాగాణిల్లాగా విలసిల్లుతూ సిరుల పంటలు పండుతున్నాయి. ఈ ప్రాంతం వాళ్లకే కూలి పని దొరకని పరిస్థితుల నుంచి ఇతర రాష్ట్రాల కూలీలకు పనులు కల్పించే స్థాయికి తెలంగాణ వ్యవసాయం అద్భుతంగా ఎదిగింది.
రైతులకు దన్నుగా సీఎం కేసీఆర్
రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం. విత్తనాలు,ఎరువుల దగ్గర నుంచి పంట పెట్టుబడి వరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి ఉంటుంది. పెట్టుబడి సాయం అందించడంతో పాటు సాగు నీటితోపాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడంతో భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ఫలితాలు రైతులకు అందుతున్నాయి. యాసంగిలో ఒక గుంట కూడా పంట ఎండిపోకుండా మండు టెండల్లో గోదావరి నీళ్లతో చెరువులు నింపి రైతులకు ప్రభుత్వం దన్నుగా నిలిచింది. దీంతో రైతులు వ్యవసాయాన్ని సంబురంగా చేసుకున్నారు. రికార్డు స్థాయిలో ప్రతి సంవత్సరం సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గుంట జాగ లేకుండా ప్రతి అంగుళం సాగులోకి వచ్చింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రైతుల ముంగిట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వారం రోజుల్లోనే రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ధాన్యం డబ్బులు జమఅవుతున్నాయి. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారు. నాలుగు రూపాయలు రైతుల జేబుల్లో కనిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల విషం చిమ్ముతున్నది. ధాన్యం కొనుగోలు విషయంలో మెండి వైఖరిని అవలంబిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దన్నుగా నిలిచింది… నిలుస్తోంది.
ఊరూరా గోదావరి జలాల సంబురం
కరువుకాటకాలతో కటకటలాడిన సిద్దిపేట జిల్లా నేడు కల్పతరువుగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు జిల్లాలో ఒక నీటిపారుదల ప్రాజెక్టు కూడా లేదు. చెరువులు అధ్వానంగా ఉండేవి. వాగులు, చెక్ పట్టించుకోలేదు. నేడు సీన్ రివర్స్ అయ్యింది. గ్రామగ్రామాన గోదావరి జలాలు పరవళ్లు తొకుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్,గౌరవెల్లి రిజర్వాయర్లను అద్భుతంగా నిర్మించారు. మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వం 2,131 చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చింది. ఇవాళ అన్ని చెరువులు, చెక్ గోదావరి జలాలతో నింపుకొన్నాం. ఆనాడు వానకాలంలో కూడా గుకెడు నీటికి కటకట ఎదురొన్న ఈ ప్రాంతాల్లో నేడు మండుటెండల్లో చెరువులు, కుంట లు మత్తళ్లు దుంకుతున్నాయి.
నాటికి… నేటికి వ్యవసాయంలో తేడా..
రికార్డు స్థాయిలో పెరిగిన సాగు విస్తీర్ణం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఉద్యమ నేతనే సీఎం కేసీఆర్ కావడంతో రైతులకు అన్ని మంచి రోజులు వచ్చాయి. సమైక్య రాష్ట్రంలో అరిగోస పడ్డ రైతులు స్వరాష్ట్రంలో సంబురంగా ఎవుసం చేసుకుంటున్నారు. రైతులకు దన్నుగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారు. ఎక్కడో పుట్టిన గోదావరిని సిద్దిపేట జిల్లాకు తీసుకువచ్చి బీడు భూముల్లో పారించడంతో పచ్చని పంట పొలాలతో జిల్లా కోనసీమను తలపిస్తున్నది. గతంలో పది, ఇరవై బస్తాల వడ్లు పండించిన రైతులు ఇవాళ క్వింటాళ్ల కొద్ది, ట్రాక్టర్ల లోడ్లు నింపుతున్నారు. సిద్దిపేట జిల్లాలో వానకాలంలో మొత్తం 5,23,887 ఎకరాలు సాగు కాగా పత్తి 1,08,271 ఎకరాలు, వరి 3,76,000 ఎకరాలు, మొక్కజొన్క 25,872 ఎకరాలు, కందులు 6,818 ఎకరాల్లో సాగైంది.ఇలా ప్రతి యేటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. అదే స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా ఈ ప్రభుత్వం నిలుస్తున్నది. సిద్దిపేట జిల్లా ఏర్పాటైన నుంచి వరి సాగు విస్తీర్ణం చూస్తే గణనీయంగా పెరిగింది. 2016-17 వానకాలంలో 57,8 65 ఎకరాలు సాగైతే… అదే 2022 వానకాలంలో 3,03,912 ఎకరాల్లో సాగు చేశారు. దీన్ని బట్టి ఎంత వరిసాగు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటికీ ఇప్పటికీ దాదాపు ఐదు రెట్లు వరిసాగు పెరిగింది. 2016 వానకాలంలో 16,613 మంది రైతులకు రూ. 65.76 కోట్లు చెల్లిస్తే ..అదే వానకాలం 2022లో 99,386 మంది రైతులకు రూ. 782.62 కోట్లు చెల్లించింది. ఇక యాసంగి విషయానికి వస్తే 2016-17 యాసంగిలో 1,06,880 ఎకరాలు సాగు చేస్తే ..అదే 2021-22 యాసంగిలో 2,62,277 ఎకరాలు సాగు చేశారు. అప్పుడు 43,159 మంది రైతులకు రూ.278.13 కోట్లు చెల్లిస్తే గత యాసంగిలో 90,714 మంది రైతులకు రూ. 769.06 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింది. 2022-23 యాసంగిలో 3,63,173 ఎకరాల్లో వరిసాగు చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి సుమారు 280 కోట్లు చెల్లించింది. ప్రస్తుత వానకాలంలో 3,76,000 ఎకరాల్లో వరి సాగు చేశారు.
నాడు వలసలు.. నేడు ఉపాధి
పల్లెల్లో పచ్చని వాతావారణం ఉంది. అన్ని వర్గాల వారికి చేతినిండా పని దొరకుతుంది. ఇవాళ ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆథిత్యమిస్తున్నది. పక్క రాష్ర్టాల నుంచి ఇక్కడికి కూలీలు పెద్దఎత్తున వచ్చి పనులు చేసుకుంటున్నారు. వరి నాటు నుంచి వరి కొత వరకు అన్ని పనులు చేస్తున్నారు. రైస్ ఇతర పరిశ్రమల్లో కూడా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీలు ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ర్టాల నుంచి పనుల కోసం కూలీలు ఇక్కడికి వచ్చి తమ జీవనం సాగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇతర రాష్ర్టాల నుంచి వరి కోత యంత్రాలతో పాటు స్థానికంగా యంత్రాల సంఖ్య పెరిగింది. ఒకవిధంగా పల్లె వాతావారణం పూర్తిగా మారింది. చెరువులు నిండడంతో పాటు రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయి. వ్యవసాయాధారిత పరిశ్రమల్లో కార్మికులకు పని మస్తుగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో పల్లె జీవన వ్యవస్థ పూర్తిగా మారింది.
పూర్తిగా మారిన పల్లెలు
బతుకు దెరువు ఎలా …? కుటుంబ పోషణ ఎలా…? ఇలా ప్రజల జీవన విధానంలో ఎదో ఒక రకమైన దిగులు.. ఇవన్నీ ఒకప్పటికి మాటలు… ఇవాళ ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఇప్పడు ధైర్యం కనిపిస్తున్నది. సాగు సంబురమైంది. పల్లెలో ఎవుసం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వ్యవసాయాధారిత పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు చేతినిండా పని దొరుకుతున్నది. గోదావరి జలాలతో పాటు వర్షానికి నీళ్లువచ్చి చెరువులు, కుంటలు, చెక్ నిండుకుండలా కనిపిస్తున్నాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరణ చేయడంతో పూర్వవైభవం వచ్చింది. భూగర్భజలాలు పెరగడంతో బోరు, బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వివిధ కుల వృత్తుల వారికి ఉపాధి దొరుకుతున్నది. అందుకే ఊరికి చెరువు ఆదెరువు. చెరువుల పునరుద్ధరణతో ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వారిలో రైతులు, వ్యవసాయ కూలీలు ముందు వరుసలో ఉన్నారు. చెరువు మీద ఆధారపడే
కులవృత్తులవారికి ఫుల్ ఉపాధి ఉంది.
ట్రాక్టర్లకు మంచి గిరాకీ
జిల్లాలో వ్యవసాయ సాగు పెరగడంతో ట్రాక్టర్లకు మంచి గిరాకీ ఉన్నది. ఇదివరకు ఎండ్ల నాగళ్లతో పొలాలు దున్ని నాట్లు వేసేవారు. ప్రస్తుతం ఎండ్ల నాగళ్లు కనిపించకుండా పోయాయి. ప్రతి రైతు ట్రాక్టర్ల ద్వారానే సాగు చేస్తున్నారు. బోరు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో రైతులు పడావు భూములను సైతం కొత్తగా పొలాలు అచ్చుకట్టి సాగు చేస్తున్నారు.ఏగ్రామంలో చూసినా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతుండడంతో రైతులతో పాటు ట్రాక్టర్లు కొనుగోలు చేసిన యజమానులు, దానిపై పనిచేసే కార్మికులు, ట్రాక్టర్ గ్యారేజీలకు ఫుల్ పని దొరుకుతున్నది. కొన్ని ప్రాంతాల్లో డీజిల్ కూడా పని ప్రదేశాలకే తీసుకెళ్లి ట్రాక్లర్లలో పోస్తున్నారు. మొత్తంగా సాగుబడితో ముడిపడి ఉన్న దుకాణాల్లో వ్యాపారాలు ఫుల్ నడుస్తుండడంతో అందరూ సంతోషంగా ఉన్నా రు. సిద్దిపేట జిల్లాలో భూగర్భజలాలు పెరగడంతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మంచిగిరాకీ ఉన్నది.
చేతినిండా పనిదొరుకుతున్నది
దుబ్బాక, సెప్టెంబర్ 24: సీఎం కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత ఎవుసం బాగా పెరిగింది. బీడు భూములు కూడా సాగులోకి వచ్చాయి. దీంతో పంట సాగు విస్తీర్ణం పెరిగింది. ఏ ఊరులో చూసినా నిండిన చెరువులు, కుంటలు కనిపిస్తున్నాయి. పచ్చని పంటలతో పల్లెలు కనిపిస్తున్నాయి. వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు వంటి ఎన్ని యంత్రాలు వచ్చినా పనిచేసే కూలీలు సరిపోతలేరు. మాకైతే కేసీఆర్ సర్కారులో చేతి నిండా పని ఉంటున్నది. గతంలో (తెలంగాణ రాక ముందు) వానలు పడితేనే ఎవుసం పనులు నడిసేవి. అప్పుడు ఎంత ఇస్తే అంతే తీసుకునేటోళ్లం. దినమంతా పని చేస్తే వంద రూపాయలు కూడా రాకుండేది. ఇప్పుడైతే వరి నాట్లు, కలుపు తీసుడు, మందు సల్లేందుకు ఏడాది పొడవునా పని ఉంటుంది. అప్పుడేమో పని కోసం రైతుల వద్దకు తిరిగితే.. ఇప్పుడు రైతులు మా వద్దకు వచ్చి పొలాలకు బండ్ల(వాహనాల) మీద తీసుకుపోతున్నారు. వరినాట్లు వేసే సమయంలో రోజుకు వెయ్యి వరకు తీసుకున్నాం. ఇప్పుడు మందు సల్లెందుకు రూ.5 వందలు తీసుకుంటున్నాం. కేసీఆర్ సారు వచ్చిన తర్వాత కాలం మంచిగా అయితుంది. పంటలు బాగా పండుతున్నాయి. పంటలు పండితేనే అందరికీ మంచిగా ఉంటుంది. మాకైతే పనికి, పైసలకు ఢోకాలేదు. సీఎం కేసీఆర్ సారు ఇస్తున్న ఆసరా పింఛన్ పైసలు కూడా అవసరాలకు సరిపోతున్నాయి. తెలంగాణలో వ్యవసాయ విస్త్రీర్ణం పెరగడంతో పనులు చేసేందుకు కూలీలు సరిపోతలేరు. పక్క రాష్ర్టాలు బీహార్, మధ్యప్రదేశ్ నుంచి కూలీలు ఇక్కడికి వచ్చి ఎవుసం పనులు చేస్తున్నారు. అప్పుడేమో నీళ్లు లేక పంటలు పండక భూములు అమ్మకుని గల్ఫ్ ముంబాయి పోతే ఇప్పుడు తెలంగాణలోని గ్రామాలకు పక్కరాష్ర్టాల నుంచి పనుల కోసం కూలీలు వస్తున్నారు. కేసీఆర్ దయవల్ల గ్రామాల్లో కూలీలకు చేతినిండా పనితో పాటు పైసలు దొరుకుతున్నాయి.
– టేకుల లక్ష్మి, వ్యవసాయ కూలీ, లచ్చపేట, దుబ్బాక మున్సిపాలిటీ
భూగర్భజలాలు పెరిగాయి
సిద్దిపేట, సెప్టెంబర్ 24: కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గోదావరి జలాలు రంగనాయకసాగర్ వచ్చాయి. సిద్దిపేట ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో బీడు భూములు సాగులోకి వచ్చాయి. నాకు ట్రాక్టర్ ఉంది. దున్నుకాలప్పుడు తీరిక లేకుండా పనిఉంటుంది. ఆ సమయంలో నాతోపాటు డ్రైవర్ కూడా పని ఉంటుంది. దున్నుకాల సమయంలో మరో ట్రాక్టర్ తీసుకుంటాం. ఒకప్పుడు ఒక ట్రాక్టర్ పని ఉండేది కాదు, గోదావరి జలాలు వచ్చిన తర్వాత భూములన్నీ సాగులోకి వచ్చాయి. నేను కూడా 10 ఎకరాలు లీజుకు తీసుకొని వరి సాగు చేస్తున్నా..గతంలో పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు నేడు నీళ్లు రావడంతో గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. నా లెక్క ట్రాక్టర్లు ఉన్న వాళ్లుకు మంచి గిరాకీ ఉంది. గతంలో ఒక పంట పండుడే గగమైన చోటా నేడు రెండు పంటలు పండటంతో రైతులు అనందంగా ఉన్నారు. నాట్లు వేసే సమయంలో మహిళా కూలీలకు రోజుకు రూ.300 నుంచి రూ.400 ఇచ్చాం. గోదావరి జలాలతో పాటు 24గంటల విద్యుత్ రావడం సంతోషంగా ఉన్నది.
-బాదన్నగారి రవి, సిద్దిపేట ట్రాక్టర్ యాజమాని, సిద్దిపేట
సీఎం కేసీఆర్ ధన్యవాదాలు
ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఉపాధి కోసం ఆరేండ్ల కింద హార్వెస్టర్, ట్రాక్టర్ కొనుగోలు చేశా. నేను ఉపాధి పొందడమే కాకుండా మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నా. సీజన్ వస్తే తినడానికి కూడా తీరిక లేకుండా 24గంటల పని దొరుకుతున్నది. చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంతో మునుపటి కంటే పంటల సాగు విస్తీర్ణం ఇప్పుడు బాగా పెరిగింది. ట్రాక్టర్ ఎకరానికి రూ.6వేలు, హార్వెస్టర్ గంటకు రూ. 3వేలు కిరాయి ఇస్తుండ్రు. మా ఊరులో ఒకప్పుడు ఒక హార్వెస్టర్ కూడా లేకుండే ఇప్పుడు 10 ఉన్నాయి. ఒక్కోసారి టైంకు హార్వెస్టర్లు దొరుకకపోతే రైతులు ఆంధ్ర, తమిళనాడు రాష్ర్టాల నుంచి కూడా కిరాయికి తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఊళ్లే 100కు పైగా ట్రాక్టర్లు ఉన్నా దున్నకాలకు దొరుకుతలేవు. ఈ ఏడాది మరో హార్వెస్టర్, ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నా. ఒకప్పుడు పనిలేక పట్నాలకు పోయేటోళ్లు ఇప్పుడు పల్లెలకు వస్తున్నారు. తెలంగాణలో భూముల ధరలు కూడా పెరిగాయి. నాలాంటి యువకులకు గ్రామంలోనే ఉపాధి దొరుకుతున్నది. దీనికి కారణం సీఎం కేసీఆర్ ముందు చూపే అని చెప్పక తప్పదు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం వంటి చర్యలతోనే తెలంగాణ రూపురేఖలు మారిపోతున్నాయి. బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు.
– ఇమ్మడి భాస్కర్ హార్వెస్టర్ యజమాని, బైరాన్