మెదక్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ బుధవారంతో పూర్తయ్యింది. మెదక్ జిల్లావ్యాప్తంగా 469 పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి 2,25,680 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు.
వీటిలో మహాలక్ష్మి పథకం కింద 1,87,883 దరఖాస్తులు, రూ.500 వంట గ్యాస్కు 1,95,377 దరఖాస్తులు, ఎకరాకు రూ.15000 పెట్టుబడి సాయం కోసం 1,45,777, కౌలు రైతుల నుంచి 6579, ఇందిరమ్మ ఇండ్లకు 1,93,169, ఇంటి స్థలం కోసం తెలంగాణ ఉద్యమకారుల నుంచి 2226, 250 గజాల స్థలానికి 405, 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 1,74,016, దివ్యాంగుల పింఛన్లు 4685, ఇతర పింఛన్లకు 46,960
దరఖాస్తులు వచ్చాయి.