ఆగస్టులో రిటైనింగ్వాల్ పనులు మొదలుపెట్టాలి
అధికారులతో మంత్రి గంగుల సమీక్ష ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): మానేరు రివర్ ఫ్రంట్ డీపీఆర్ను జూలై నెలాఖరుకల్లా పూర్తి చేయాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆగస్టులో రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు ఇతర సివిల్ పనులకు టెండర్లు పిలిచి ఏడాదిలోగా పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రాజెక్టు పురోగతిపై మంగళవారం జలసౌధలో టూరిజం, ఇరిగేషన్శాఖల ఉన్నతాధికారులతో పాటు, ఏకాం సర్వే సంస్థ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ పట్టణాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అత్యద్భుతమైన వాటర్బాడీనీ రివర్ఫ్రంట్గా తీర్చిదిద్దాలని సంకల్పించారని చెప్పారు. బోటింగ్కు అనుగుణంగా రివర్ఫ్రంట్ను రూపొందించడంతోపాటు దుబాయ్, ఓర్లాండో, సింగపూర్ మాదిరిగా ప్రపంచస్థాయి అమ్యూజ్మెంట్ పార్క్, వాటర్స్పోర్ట్స్, లేజర్షో, వాటర్ లైటింగ్, ఇతర ఫెసిలిటీస్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని టూరిజం అధికారులు వివరించారు. ఇప్పటివరకు 1.8 కిలోమీటర్ల డిజిటల్ సర్వే పూర్తయిందని ఏకాం ప్రతినిధులు మంత్రికి వివరించారు. సమావేశంలో ఇరిగేషన్, కాడ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీలు మురళీధర్రావు, శంకర్, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్రావు, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం, ఏకాం ప్రతినిధులు పాల్గొన్నారు.