విజయం ఎవరిని వరించునో తెలిసే రోజు నేడు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ హవేళీఘనపూర్లోని వైపీఆర్ కళాశాలలో ఆదివారం జరగనున్నది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ భవితవ్యం నేడు తేలనున్నది. జిల్లాలో రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో 24 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది. మెదక్ నియోజకవర్గంలో 274, నర్సాపూర్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మెదక్లో 20 రౌండ్లు, నర్సాపూర్లో 22 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. తొలుత మెదక్ ఫలితం వెలువడనున్నది. కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో కూడిన మూడంచెల భద్రతను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మెదక్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ హవేళీఘనపూర్లోని వైపీఆర్ కళాశాలలో ఆదివారం జరుగనున్నది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలనున్నది. గత నెల 30న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించారు. ఈ నెల 3న ఓట్ల లెకింపు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
జిల్లాలో రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో 24 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభంకానున్నది. ఉదయం 5.30 గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకోనున్నారు. పాసులు ఉన్న వారికే లోపలికి అనుమతిస్తారు. వైపీఆర్ కళాశాలలోని రెండో అంతస్తులో 14 టేబుళ్లు ఓట్ల లెకింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు ముగ్గురు సిబ్బందిని నియమించారు. మొదట పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఇవి పూర్తయిన తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు విడుదలవుతుంది.
పోలింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి. ఎవరిని విజయం వరిస్తుందన్న అంశంపై పోటీ చేసిన అభ్యర్థుల్లో తీవ్ర ఉతంఠ నెలకొన్నది. తమకున్న విజయావకాశాలను అంచనా వేస్తూ, పోలింగ్ సరళిని అంచనా వేస్తూ గెలుపు, ఓటములను విశ్లేషించుకుంటున్నారు. ఓటింగ్ తమకు సానుకూలంగా ఉన్నదని, మెదక్ జిల్లా ఓటర్లు మరోసారి అభివృద్ధి వైపు నిలుస్తారని బీఆర్ఎస్ అభ్యర్థులు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నేతృత్వంలో జరిగిన మెదక్ అభివృద్ధిని ప్రజలు ఆశీర్వదించారని అనుకుంటున్నారు. మెదక్ జిల్లా ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు పేరొంటున్నారు. మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నర్సాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలింగ్ శాతాన్ని బట్టి మొత్తంగా బీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉన్నదని, భారీ మెజార్టీ సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శుక్రవారం పోలింగ్ సరళి 17 ఏ రిజిస్ట్రర్ పరిశీలనకు అన్ని పార్టీలు హాజరయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, ఆర్వోలు అంబదాస్ రాజేశ్వర్, శ్రీనివాసులు, పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. కౌంటింగ్ ప్రక్రియ వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించనున్నారు. లెక్కింపు కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ ఉండేలా జనరేటర్లు, ఇన్వర్టర్లు అందుబాటులో ఉంచనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, గొడవలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో కూడిన మూడంచెల భద్రతను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది.
మెదక్ నియోజకవర్గంలో 274 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో 14 ఈవీఎంలు, ఒక టేబుల్ను పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఉపయోగిస్తారు. మెదక్లో 20 రౌండ్లలో లెక్కింపు పూర్తి అవుతుంది. నర్సాపూర్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు, 22 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం మెదక్లో 4 టేబుళ్లు, నర్సాపూర్లో 2 టేబుళ్లను ఏర్పాటు చేశారు.