నర్సాపూర్, ఏప్రిల్ 12: పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్కు ప్రత్యేక స్థానం ఉందని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో నర్సాపూర్ నియోజకర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం నీలం మధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ ఎంపీగా గెలిచారన్నారు. నానమ్మ గెలిచిన స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే మనువడు రాహుల్గాంధీ, కోడలు సోనియాగాంధీ సంతోషపడతారని వెల్లడించారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు ప్రజల్లో మంచి పలుకుబడి ఉందన్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తే 45 వేల ఓట్లు వచ్చాయన్నారు. ముదిరాజ్, బీసీ బిడ్డగా నీలం మధును ఆశీర్వదించాలని కోరారు. బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టేనని, బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14, 15 ఎంపీ స్థానాలు గెలిపించి, రాహుల్గాంధీకి బహుమానంగా ఇవ్వాలన్నారు. ప్రతిఒక్కరూ నీలం మధు విజయానికి కృషి చేయాలని కోరారు.
మెదక్ ఎంపీగా తనను ఆశీర్వదించి, గెలిపించాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కార్యకర్తలను కోరారు. ఉప సర్పంచ్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎదిగానని, ప్రజలందరూ ఆశీర్వదించాలని వెల్లడించారు. తెలంగాణకు బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్, సింగూర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టేనన్నారు. పార్లమెంట్కు నన్ను పంపిస్తే నిధులు తీసుకొచ్చి మెదక్ను అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామాల్లో సంక్షేమ ఫలాలు అందేలా చూస్తానన్నారు. అన్ని వర్గాలకు కార్పొరేషన్ పదవులు వరించడం కేవలం కాంగ్రెస్తోనే సాధ్యపడిందని తెలిపారు. సమావేశంలో మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఎంపీపీ జ్యోతిసురేశ్, నాయకులు మల్లేశం, అశోక్, మణికంఠ, సుహాసినిరెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనివాస్గుప్తా, సుజాతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.