సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 22 : ఓ వైపు కరువు, మరో వైపు అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులు గోస పడుతున్నా, రాష్ట్ర ప్రభు త్వం మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో రైతులు అసహనానికి గురవుతున్నారు. ఒక వైపు సాగునీరు అందక పంటలు ఎండుతుంటే..
మరో వైపు అకాల వర్షాలతో నష్టపోవడమే కాకుండాకొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం పూర్తిగా తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తెచ్చిన అప్పులు కట్టలేక రైతులు అరిగోస పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో సుమారు 15 మంది రైతులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే మరికొంత మంది కరెంట్ షాక్, ఇతర కారణాలతో మరణించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంది. 24 గంటల నాణ్యమైన కరెంట్, సకాలంలో రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు అందజేయడంతోపాటు ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతిగింజనూ కొనుగోలు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. వరి కోతలు ప్రారంభమై కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి 20 రోజులు గడుస్తున్నా ఇంకా ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వం రాగానే ఎకరాకు రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని, రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇపుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి సిద్దిపేట జిల్లాలో 603 మంది రైతులకు రూ.30.15 కోట్ల రైతుబీమా రైతుల ఖాతాలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ కారణాల వల్ల ఇంకా కొంత మందికి రైతుబీమా అందలేదని అధికారులు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపు మేరకు ఇప్పటికే రైతులు పోస్ట్ కార్డు ఉద్యమం పేరిట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉత్తరాలు రాస్తున్నారు. సిద్దిపేట స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం కొనసాగుతున్నది.