మెదక్/సిద్దిపేట/సదాశివపేట, డిసెంబర్ 7 : కొవిడ్ మూడో ముప్పు, ఒమిక్రాన్ విజృంభిస్తున్న తరుణంలో కట్టడి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే నిబంధనను విధించింది. మాస్క్ లేకుండా విచ్ఛలవిడిగా తిరిగే వారికి రూ.వెయ్యి జరిమానా వేస్తున్నది. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజూ తనిఖీలు చేయిస్తున్నది. జిల్లాల్లోని సర్కిల్ కార్యాలయాల పరిధిలోని పోలీసు సిబ్బంది ప్రతిరోజూ తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇండ్ల నుంచి బయటకు వస్తే మాస్క్ ధరించి రావాలని సూచిస్తున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాస్క్ ధరించకుండా రోడ్లపైకి వస్తున్న వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. తనిఖీల్లో జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021, 6వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మాస్క్ ధరించని 13,068 కేసులు నమోదయ్యాయి. ఈ-చలాన్ ద్వారా 10,688 కేసులు, ఈ-పెట్టీ యాప్ ద్వారా 2,380 కేసులు నమోదు చేశారు. మెదక్ జిల్లాలో 140మందికి జరిమానాలు విధించారు. సిద్దిపేట జిల్లాలో పోలీసులు వాహనదారులు, ప్రజలకు మాస్క్పై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఫైన్ కూడా వేయలేదు.
భయం ఉన్నా.. నిర్లక్ష్యమే..
కొవిడ్ నుంచి కోలుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రజలను బయపెడుతున్నది. ఓ వైపు ఒమిక్రాన్ బయపెడుతున్నా కొందరూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాస్క్ ధరించకుండానే రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు ఉదయం నుంచే రోడ్లపై మాస్క్ ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నా, భయపడకుండా యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. చదువుకున్న యువతీయువకులు ఇష్టారాజ్యంగా తిరుగుతూ హోటళ్లు, సినిమా థియేటర్లు, వ్యాపార, వాణిజ్య ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం లేదు. చిన్న పిల్లలతో సహా పార్కులు, సందర్శన స్థలాలకు వెళ్లినప్పుడు మాస్క్లు మరిచిపోవడమే కాకుండా ఒమిక్రాన్ ప్రమాదం పొంచి ఉన్న సంగతి గుర్తించకపోవడం శోచనీయం. మాస్క్ నిబంధన కఠినతరం చేసిన పోలీసులు, మూడు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ-చలాన్ ద్వారా కేసులు నమోదు చేయడంతో పాటు, ఈ-పెట్టీ యాప్ ద్వారా కూడా జరిమానాలు విధిస్తున్నారు.
ఉచితంగా మాస్క్ల పంపిణీ..
ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుందన్న సమాచారంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై స్టేషన్ల వారీగా రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. మాస్క్లు లేని వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ఉచితంగా మాస్క్లు పంపిణీ చేశారు. గత శనివారం సంగారెడ్డి పట్టణంలో సీఐ రమేశ్కుమార్, పోతిరెడ్డిపల్లిలో సీఐ శివలింగం, సదాశివపేటలో సీఐ సంతోశ్కుమార్ వాహనదారులకు మాస్క్లు పంపిణీ చేశారు. మాస్క్ ధరించకుంటే జరిగే పరిణామాలను వివరిస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ధరించాలని సూచించారు.