సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్ మున్సిపాలిటీ, మే 28: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ముగిశాయి. సంగారెడ్డి జిల్లాలో చివరిరోజు సాంఘిక శాస్త్రం పరీక్షకు 99.09 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 22,554 మంది విద్యార్థులకు గానూ 22,348 మంది హాజరయ్యారు. 206 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్ జిన్నారం, గుమ్మడిదల, బొల్లారం, బొంతపల్లి తదితర పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు 36 కేంద్రాలను తనిఖీ చేయగా, మొత్తం 42 పరీక్షా కేంద్రాలను అధికారులు పరిశీలించారు.
మెదక్ జిల్లాలో చివరిరోజు పరీక్షకు 98.91 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 72 పరీక్షా కేంద్రాల్లో 11,396 మంది విద్యార్థులకు గానూ 11,272 మంది హాజరు కాగా, 124 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, మెదక్ డీఈవోలు రాజేశ్, రమేశ్కుమార్ మాట్లాడుతూ చివరిరోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఎగిరి గంతేశారు. ఏడాది కాలంగా పుస్తకాలతో బిజీబిజీగా ఉన్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో వారు స్నేహితులతో కలిసి ఆనందంగా ఇంటిబాట పట్టారు. మరో రెండు రోజుల్లో ఓఎస్ఎస్సీ పరీక్షలు కూడా పూర్తికానున్నాయి.