హుస్నాబాద్టౌన్, మార్చి 24: అభివృద్ధి పరుగులు పెట్టాలంటే పన్ను చెల్లించాల్సిందే. పట్టణాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఆస్తిపన్ను కీలకంగా మారింది. ఇందుకోసం అధికారులు హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లు పూర్తిస్థాయిలో చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈనెల 31వ తేదీలోపు 100 శాతం ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే పట్టణంలో దాదాపు 78శాతానికి పైగా ఆస్తిపన్ను వసూలు చేసిన అధికారులు మిగతా 27శాతం వసూళ్లు చేపట్టాలని నిర్ణయించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పన్ను వసూళ్లపై ఎవరికీ మినహాయింపులు ఇవ్వకుండా ఖచ్చితంగా వసూళ్లు చేస్తున్నారు.
హుస్నాబాద్ పట్టణంలో 6,672 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ఉండగా 2022-23 సంవత్సరానికి రూ.1.11కోట్ల పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 84శాతానికి మాత్రమే వసూలు చేయగలిగారు. ఈ ఏడాది 2023-24 సంవత్సరానికి 7,173 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు రూ.1.66.14కోట్ల రూపాయల పన్నులు వసూలే లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 78శాతం పన్ను వసూళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆస్తి పన్ను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు మైక్ల ద్వారా ప్రచారం చేయించడమే కాకుండా, ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది వందశాతం పన్ను వసూలు చేసే లక్ష్యం దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లు చేపట్టేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు, తాగునీటి కనెక్షన్లు, ట్రేడ్లైసెన్సులు, ఖాళీస్థలాలు, ప్రచార బోర్డులతో పాటు పలు రకాల పన్నుల వసూళ్లే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. ఇందుకు ఒక బృందానికి ఇన్చార్జితోపాటు ముగ్గురు సభ్యుల చొప్పున నాలుగు బృందాలను ఏర్పాటు చేసి వసూళ్లు చేస్తున్నారు.
సంవత్సరాల తరబడి పన్నులు చెల్లించని వారికి మున్సిపల్ అధికారులు రెడ్నోటీసులు ఇప్పటికే జారీచేశారు. కోర్టులు తదితర కారణాలు చూపుతున్న వారిని కలిసి పన్నులు చెల్లించాలని సూచిస్తూ రెడ్ నోటీసులు జారీచేస్తున్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీచేసినట్లు అధికారులు వివరిస్తున్నారు.
మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆస్తిపన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. పన్ను వసూళ్ల కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేశాం. మార్చి 31వతేదీలోపు పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నా. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు ఇచ్చాం. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – టి.మల్లికార్జున్గౌడ్ కమిషనర్ హుస్నాబాద్ మున్సిపల్