అమీన్పూర్, మార్చి 4: పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల ఉనికి ప్రశ్నార్థంగా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లోని ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అమీన్పూర్ రజక సంఘం సభ్యులు సుమారు వంద మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీన్పూర్లో ఇప్పటికే బీఆర్ఎస్ ఉహించని రీతిలో బలంగా తయారయ్యిందన్నారు. అనతి కాలంలోనే మరిన్ని చేరికలతో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు. ఇతర పార్టీలు అనవసరమైన ఉహాగానాలకు తెర లేపుతూ బద్నాం చేసే పని పెట్టుకున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ఘననీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మహేశ్, కౌన్సిలర్లు బీజీలీ రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ పట్ణణ అధ్యక్షుడు బాల్రెడ్డి, నాయకులు తలారి రాములు, యూనూస్, ప్రమోద్ రెడ్డి, జగదీశ్, గోపాల్, మహిపాల్రెడ్డి, మహేందర్రెడ్డి పాల్గొన్నారు.