గజ్వేల్లోని మురికినీరు మెరుగ్గా మారుతున్నది. మురుగు నీటికి శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. సీఎంకేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.100కోట్ల వ్యయంతో యూజీడీ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రారంభించారు. డిసెంబర్ చివరికల్లా యూజీడీ పనులు పూర్తి కానున్నాయి. నాలుగు ఎస్టీపీ ట్యాంకుల ద్వారా మురికి నీరును శుద్ధి చేస్తున్నారు. శుద్ధ జలాలను కుంటలు, చెరువుల్లో వదులుతున్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని పరిశుభ్రంగా, అందంగా అభివృద్ధి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గజ్వేల్, డిసెంబర్ 5 : మురుగునీరంటేనే ముక్కుమూసుకుని ఆ ప్రాంతంలో నిలబడాలంటేనే ఇబ్బంది పడే అవస్థలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పూర్తిగా తొలిగిపోతున్నాయి. మురుగు కాల్వల్లోని నీరు పూర్తిగా శుద్ధి చేయబడి తాగునీరుగా మారి కాల్వల్లోకి పారుతున్నది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మురుగునీటి నిర్వహణ సమస్య పరిష్కారం సీఎంకేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రూ.100కోట్లతో అంతర్గత మురుగు నీటి వ్యవస్థ నిర్మాణం చేపట్టారు. గత మూడేండ్ల క్రితం ప్రారంభమైన ఈ పనులు కరోనా కారణంగా ఆలస్యంగా జరిగాయి. మున్సిపాలిటీ వ్యాప్తంగా ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీటిని చెరువులు, కుంటల్లోకి వెళ్లేవిధంగా మార్చడంతో ఆ చెరువులు, కుంటలన్నీ మురుగు నీటితో పూర్తి దుర్గంధంతో నిండిపోయాయి. చెరువుల దుస్థితి గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ చెరువులు, కుంటలను స్వచ్ఛంగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. మున్సిపాలిటీకి మురుగునీటి నుంచి శాశ్వత పరిష్కారం కోసం యూజీడీ పనులను ప్రారంభించారు. మురుగు నీటి నిర్వహణ కోసం పూర్తిగా అంతర్గత మురుగునీటి లైన్ను నిర్మించడంతో పాటు ఈ పైపుల ద్వారా వచ్చే మురుగునీటిని ఎస్టీపీల ద్వారా శుద్ధిచేసి కాల్వల్లో నీటిని విడుదల చేస్తున్నారు.
నాలుగు ఎస్టీపీల ద్వారా నీటి శుద్ధి
మున్సిపాలిటీలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని పాటు రాజిరెడ్డిపల్లి గ్రామంలోని 7500లకుపైగా ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీటిని ప్రాంతాల వారీగా విభజించి నాలుగు సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ద్వారా మురు గు నీటిని శుద్ధి చేస్తున్నారు. పాండవుల చెరువు వద్ద, రాజిరెడ్డిపల్లి వద్ద, పిడిచెడ్మార్గంలో క్యాసారం -ప్రజ్ఞాపూర్ శివారుల్లో మొత్తం నాలుగు ఎస్టీపీలలో ప్రతి రోజూ వేలలీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. అంతర్గత మురుగు కాల్వల ద్వారా వచ్చిన నీరు ఎస్టీపీ ప్లాంట్ల వద్ద ఉన్న పంప్ హౌజ్లోని మొదటగా చేరుతాయి. అక్కడ పంపింగ్ అయ్యి మురుగు నీటి కోసం ఏర్పాటు చేసిన పెద్దట్యాంకుల్లోకి చేరుతాయి. అక్కడి నుంచి చిన్నపాటి కాల్వల ద్వారా ఫిల్టర్బెడ్లోకి మురుగునీరు చేరి ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన శుద్ధ నీరు సంప్హౌస్లోకి ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని వాగుల్లోకి చేరుతున్నాయి.
రెండో విడత యూజీడీ పనులు
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో యూజీడీ పనులు పటిష్టంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 80శాతం పనులు పూర్తి కాగా, మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం, ముట్రాజ్పల్లి, సంగుపల్లి, సంగాపూర్లో రెండో విడత యూజీడీ పనుల కోసం రూ.49కోట్ల అంచనాలు వేశాం. నిధులు విడుదల అవ్వగానే పనులు ప్రారంభిస్తాం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని పరిశుభ్రంగా, అందంగా అభివృద్ధి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు.
– ఎన్సీ రాజమౌళి,మున్సిపల్ చైర్మన్ , గజ్వేల్
చివరిదశలో యూజీడీ పనులు
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలి టీలో రూ.100కోట్లతో నిర్మి స్తున్న యూజీడీ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఎస్టీపీల ద్వారా నీటిని శుద్ధిచేస్తుండగా, పట్టణంలో 80శాతం ఇండ్లను యూజీడీకి లింక్ చేశాం. దీంతో ఆయా ప్రాంతాల్లో మురుగునీటి సమ స్యకు పరిష్కారం లభించింది. మరో 20 శాతం పనులు ఈనెలాకరులోగా పూర్తవుతాయి.
– విద్యాధర్ , మున్సిపల్ కమిషనర్, గజ్వేల్
శాశ్వత పరిష్కారం లభించింది
దశాబ్దాలుగా గజ్వేల్లో మురుగునీటి సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారు. మురుగునీటి కాల్వలు నిర్మించినా పైక ప్పు లేక దుర్గంధం, దోమలతో ఇబ్బందులు పడేవాళ్లు. యూ జీడీ నిర్మాణంతో అన్ని వార్డుల్లో పరిశుభ్రత చోటు చేసుకుంది. దోమలు పెరగడానికి ఆస్కారం లేకుండా పోయింది. ప్రస్తుతం శాశ్వత పరిష్కారం లభించింది.
– జకీయొద్దీన్,మున్సిపల్ వైస్ చైర్మన్, గజ్వేల్
ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
యూజీడీ పనులు పూర్తి కావడంతో రోడ్లపైకి మురు గు నీరు రావడం లేదు. కొత్తగా నిర్మాణమైన ఇండ్ల కు ఇప్పటి వరకు సరైన మురుగునీటి కాల్వలు లేక ఖాళీ ప్రదేశాల్లో నీరునిల్వ కావడమేకాకుండా రోడ్లపైకి కూడా మురుగునీరు వచ్చేది. ఇప్పుడు యూజీడీ పను లు పూర్తికావడంతో మురుగునీటి సమస్య పరిష్కారమైంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు. – ఉప్పల మెట్టయ్య, 15వ వార్డు కౌన్సిలర్
అన్ని వీధులు శుభ్రం
ఒకప్పుడు మురుగునీటితో దుర్గంధం వ్యాపించడంతో అసౌకర్యంగానే కాక అనారోగ్యాలకు కూడా గురయ్యేవారు. యూజీడీ పనులు పూర్తి కావడంతో దుర్గంధంతో పాటు అనారోగ్యకర వాతావరణం లేదు. ప్రస్తుతం వార్డుల్లోని అన్ని వీధులు శుభ్రంగా ఉండడంతో పాటు ఆరోగ్యకరంగా పరిసరాలు మారాయి. దీనివల్ల ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీసీరోడ్లు పూర్తయితే మరింత సౌకర్యంగా ఉంటుంది.
– గోపాల్రెడ్డి, 20వ వార్డు కౌన్సిలర్
మురుగు వాసన బాధ తప్పింది
మురుగునీటి బాధ తప్పింది. ఏండ్లుగా మురుగు సమస్యతో బాధపడుతున్న ప్రజలకు చక్క ని పరిష్కారం లభించింది. భరత్నగర్లో ఇంటింటికీ యూజీడీ కనెక్షన్ ఇచ్చారు. మురుగునీరంతా యూజీడీ ద్వారానే వెళ్లిపోతున్నది. గతంలో మురుగునీటి నిర్వహణకు ఎంతో ఇబ్బంది కలిగేది. యూజీడీ ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి తాగునీరుగా మార్చి కాల్వల్లోకి విడుదల చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు.
– గుంటుకు రాజు, టీఆర్ఎస్ నాయకుడు