సంగారెడ్డి, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): కేసీఆర్ అంటే ఆపన్నులకు ఒక నమ్మకం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కేసీఆర్ పెద్దదిక్కు. ఆసరా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, కల్లు గీత కార్మికుల్లో కొండంత ధైర్యం నింపారు సీఎం కేసీఆర్. ప్రతినెలా రూ.2016 పెన్షన్ డబ్బులు ఇచ్చి బతికేందుకు ధైర్యం కల్పించారు. మరీ ముఖ్యంగా దివ్యాంగులకు ప్రతినెలా రూ.4016 పింఛన్ అందజేస్తూ వారిపాలిట దైవంగా మారారు. 2014కు ముందు కేవలం రూ.200 పెన్షన్ మాత్రమే వచ్చేది. సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్ పథకం ద్వారా పెన్షన్ మొత్తాన్ని ఏకంగా రూ.2016కు పెంచారు. దివ్యాంగులకు దశలవారీగా పింఛన్ పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం దివ్యాంగులు రూ.4016 పింఛన్ అందుకుంటున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయితే పెన్షన్ మరింతగా పెరగనున్నది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ.6,016, ఇతర పింఛన్ లబ్ధిదారులకు రూ.5,016 ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ద్వారా
పెన్షన్ మొత్తం పెంచుతామని ప్రకటించడంతో పింఛన్దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన మాటతప్పరని,
అధికారంలోకి రాగానే పింఛన్లు తప్పకుండా పెంచుతారని పింఛన్దారులు విశ్వాసంతో ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఆసరా పథకం ద్వారా ప్రతినెలా 1,61,341 మందికి రూ.37.20కోట్ల పింఛన్ అందజేస్తున్నారు. సీఎం కేసీఆర్ పింఛన్ అందుకునే వయస్సును 57కు కుదించారు. వయోవద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్ అందజేస్తుంది. ఏటా ప్రభుత్వం ఆసరా పింఛన్ ద్వారా రూ.432 కోట్లు 1.61 లక్షల మంది లబ్ధిదారులకు అందజేస్తుంది. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం రూ.2,458 కోట్ల పింఛన్ను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో 62,072 మంది వృద్ధాప్య పింఛన్లు అందుకుంటున్నారు. 15,016 మంది దివ్యాంగులు ప్రతినెలా రూ.4,016 పింఛన్ తీసుకుంటున్నారు. వీరితో పాటు 72,371 మంది వితంతువులు, 721 మంది చేనేత కార్మికులు, 853 మంది గీత కార్మికులు, 7,572 మంది ఒంటిరి మహిళలు, 112 మంది బీడీ కార్మికులు పింఛన్ అందుకుంటున్నారు. అలాగే 2,084 వృద్ధ్ద కళాకారులు, 395 మంది ఫైలేరియా బాధితులు, 143 మంది డయాలసిస్ రోగులు పింఛన్లు తీసుకుంటున్నారు. ప్రతినెలా 1,61,341 మంది బ్యాంకుఖాతాల్లో రూ.37.20 కోట్లు పింఛన్ డబ్బులు జమ అవుతున్నాయి. పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు కేసీఆర్ చేస్తున్న ఆర్థికసాయం అందుకుని సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఇంటి పెద్దలా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్న కేసీఆర్ వెన్నంటే ఉంటామని పింఛన్దారులు చెబుతున్నారు.