జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
మెదక్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగం
నేడు ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించనున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, అక్టోబర్ 6 : కరోనా నేపథ్యంలో ప్రభుత్వం వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో పుష్కలగా ఆక్సిజన్ దొరికే విధంగా సర్వం సిద్ధం చేసింది.
రూ.90 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్..
మెదక్ జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.90 లక్షలతో 500 ఎల్పీఎం(లీటర్ ఫర్ మినిట్) ప్లాంట్ను రాష్ట్ర ప్రభు త్వం మంజూరు చేసింది. ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్లాంట్ నిర్మాణ పనులపై దవాఖాన సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్ను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో ఒకవేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఇబ్బం ది లేకుండా ఆక్సిజన్ నిరంతరంగా ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్కు అనుసంధానంగా జనరేటర్ను సిద్ధం చేశారు.
జిల్లా ప్రజలకు ఉపయోగకరం..
మెదక్ జిల్లా దవాఖానకు ప్రతిరోజూ వందలాది మంది రోగులు వస్తుంటారు. గతంలో ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు దవాఖానలు కార్పొరేట్ దవాఖానలుగా తయారయ్యాయి. దీంతో ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు తరలివస్తున్నారు. మెదక్ జిల్లాతోపాటు పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, గోపాల్పేట్ మండలాల ప్రజలు మెదక్ ప్రభుత్వ దవాఖానకు వస్తున్నారు.
ఆక్సిజన్ కొరత ఉండదు..
ప్రభుత్వం వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మెదక్ జిల్లా దవాఖానలో 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్ను మంజూరు చేసింది. దవాఖానలో ప్రతి బెడ్ను ఆక్సిజన్ బెడ్గా మార్చుతున్నాం. ఇక రోగులు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.