టాకీసుల వద్ద సందడి షురూ
సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు
కొవిడ్ నిబంధనలు అమలు
సిద్దిపేట టౌన్, ఆగస్టు 1 : కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే, లక్షలాది మంది జీవనోపాధి పొందే దాంట్లో వెండితెర ఒకటి, కరోనాకు ముందు హిట్లు, బ్లాక్ బ్లాస్టర్లతో కళకళలాడిన వెండితెర కరోనా కష్టాల్లోకి నెట్టింది. ఇండస్ట్రీని ఫస్ట్ వేవ్ కోలుకోలేని దెబ్బ తీసింది. కార్మికుల నోటికాడి బుక్కను దూరం చేసింది. ఫస్ట్ వేవ్ తర్వాత తెరుచుకున్న టాకీసులుతో ఆత్మవిశ్వాసం నిండగా సెకండ్ వేవ్ తిరిగి కష్టాల్లోకి నెట్టింది. ఇప్పుడు కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం సినిమా హాళ్లు తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చింది. దీంతో కళామతల్లిపై ఆధారపడ్డ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సందడి షురూ..
కరోనాతో ఇన్నాళ్లు మూతపడ్డ టాకీసులు మళ్లీ తెరుచుకోవడంతో కోలాహాలం మొదలైంది. నిజానికి శుక్రవారమే సిద్దిపేట జిల్లాలో టాకీసులు పునఃప్రారంభమైనా సందడి మాత్రం సండేతోనే షురువైంది. వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవడంతో సందడి మొదలైంది. కరోనాతో ఎంటర్టైన్మెంట్కు దూరమైన సగటు ప్రేక్షకుడు తిరిగి టాకీసుల వైపు వస్తున్నారు. దీంతో ఎగ్జిబిటర్లు, టాకీసు యజమానులు, సిబ్బందిలో ఆనందం నెలకొంది.
కఠినంగా కొవిడ్ నిబంధనలు అమలు..
థియేటర్లలో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకులు కరోనా నిబంధనలు తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. మాస్క్లు ధరిస్తేనే లోనికి అనుమతిస్తున్నారు. ప్రతి ఆటకు హాల్ మొత్తం శానిటైజ్ చేస్తూ కరోనాను కట్టడి చేస్తున్నారు. టికెట్ బుకింగ్ల వద్ద భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.