న్యాల్కల్, జనవరి 11 : గర్భం దాల్చిన రోజు నుంచి అడుగు తీసి అడుగేయవద్దు.. అటు పుల్ల తీసి ఇటు పెట్టొద్దు.. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు.. వంటి అతి జాగ్రత్తలు గర్భిణుల విషయంలో సర్వసాధారణం. దీంతో తాము సిజేరియన్ వైపు అడుగులు వేస్తున్నామన్న సంగతి మర్చిపోతున్నారు గర్భిణులు. సహజ సిద్ధ ప్రసవం అనేది దాదాపు అసాధ్యం అనే స్థాయికి ఆలోచనలు స్థిరపడ్డాయి. ఈ నేపథ్యంలో వ్యాయామంతో సహజ సిద్ధ ప్రసవానికి, చక్కని సంతాన భాగ్యానికి అవకాశం ఏర్పడుతుందన్న కొత్త ఆశలు పలువురిలో చిగురింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సీజేరియన్ బాధ లేకుండా పిల్లల్ని కనాలనుకునే వివాహితలకు సహకరించం దగ్గర్నుంచి గర్భిణిగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, ప్రసవానంతరం తలెత్తే పలు ఆరోగ్య సమస్యల పరిష్కారానికి,శరీరాకృతిని మెరుగుపరుచుకునేందుకు కూడా వ్యా యామం, యోగా ఉపకరిస్తాయి. నడక వంటి తేలికపాటి వ్యాయామం, ఆసనాలతో గర్భంలోని శిశువు సజావుగా పెరగడానికి, తల్లి ఆరోగ్యంలో అసాధారణ మార్పు చేర్పులు చేసుకోకుండా ఉండడానికి యోగాసనాల సాధన ఎంతగానో ఉపయోగపడుతుంది. సహజ సిద్ధ ప్రసవాల కోసం వ్యాయామంతోపాటు వివిధ రకాలుగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది.
గర్భిణులకు సహజ సిద్ధ ప్రసవం అయ్యేందుకు మండల కేంద్రమైన న్యాల్కల్, మిర్జాపూర్ (బి) గ్రామాలకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీశ్రావు ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి ఆధ్వర్యంలో పలు ఆరోగ్య, ఉప కేంద్రాల పరిధిలోని గర్భిణులకు వ్యాయామంపై అవగాహన కల్పిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారులు శ్వేతప్రియ, గణపతిరావు, నరేందర్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు కలిసి గర్భిణులకు వ్యాయామం చేయిస్తున్నారు. సహజ సిద్ధంగా ప్రసవాలు జరిగేందుకు వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుందని గర్భిణులకు తెలియజేస్తున్నారు. గర్భధారణానంతరం 3 నెలల తర్వాత వ్యాయామం, యోగా సాధన చేయవచ్చని, తగినంత యోగా సాధన, వ్యాయామ మెళకువలు తెలిసినవారైతే ఇంకాస్త ముందుగానే మొదలు పెట్టవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తే మంచిదన్నారు. రక్తహీనత నుంచి కాపాడుకునేందుకు బెల్లంతో కూడిన పల్లిపట్టీలు, ఖర్జూరం, బీట్రూట్, క్యారెట్, పాలకూర, తోటకూర, నువ్వులు లడ్డూలను తీసుకోవాలన్నారు. డ్రైఫ్రూట్స్, ఆకుకూరలు, పన్నీర్, పెరుగు, ప్రొటీన్స్ పుడ్ బాగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలని వారికి సూచిస్తున్నారు.
ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణులు సహజ సిద్ధ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి డెలవరీ వరకు ప్రత్యేక వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆరోగ్య, ఉప కేంద్రాల పరిధిలో గర్భిణులకు సహజ సిద్ధ ప్రసవాలు జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాయామంపై అవగాహన కల్పిస్తున్నాం.
-నరేందర్, డాక్టర్, మిర్జాపూర్(బి), న్యాల్కల్ మండలం
గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గతంలో ప్రభుత్వ దవాఖానకు రావాలంటే భయపడేవారు. ప్రైవేటుకు వెళ్లేవారు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో కార్పొరేట్ స్థాయిలో అందించే వైద్య సేవలను ప్రభుత్వ దవాఖానలో అందించేందుకు చర్యలు తీసుకున్నది. దీంతో ప్రభుత్వ దవాఖానల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ డెలివరీలు జరిగితే ప్రభుత్వం కేసీఆర్ కిట్తోపాటు ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు, మగ శిశువు పుడితే రూ.12 వేలు అందిస్తున్నది. ఆమ్మఒడి వాహనాల్లో ప్రతి నెలా ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. అనంతరం అక్కడ పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి వారిని ఇండ్ల దగ్గర వదిలి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నది. దీంతో మండలంలోని గర్భిణులు, బాలింతలు ప్రభుత్వ దవాఖానలకు వెళ్లి వైద్య పరీక్షలను చేయించుకుంటున్నారు.