అందోల్, ఫిబ్రవరి 16 : సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులతో అందోల్ నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నదని, రానున్న రెండేండ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి, జిల్లాలో లక్షా 60వేల ఎకరాలకు సాగునీరందిస్తామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 21న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో బుధవారం అందోల్లో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, ఆయన సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఏడేండ్లలో వ్యవసాయ రంగానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారన్నారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా కాళేశ్వరంలో భాగంగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి, బీడు భూములను పచ్చగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాలోని భూములను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ పూనుకున్నారన్నారు. ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున్న ఘన స్వాగతం పలకాల్సిన అవసరం మనపై ఉన్నదన్నారు. ఈ నెల 21 తారీఖున జరిగే ప్రాజెక్టుల శంకుస్థాపనకు పల్లెపల్లె నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నారాయణఖేడ్కు తరలివచ్చి, పండుగ వాతావరణాన్ని తలపించాలన్నారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో తలాపునే మంజీర ఉన్నా, సాగునీటికి ఉపయోగించుకోలేని దుస్థితి ఇక్కడి రైతులదని, కానీ త్వరలో వారి ఇబ్బందులు తొలిగిపోయి, పల్లెలు పచ్చని పంటలతో కళకళలాడుతాయని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు సంబురాలు జరుపుకోవాలన్నారు.
రాష్ర్టాభివృద్ధిని ఓర్వలేక..
రాష్ర్టాభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని, బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం చేపట్టకపోగా, వారితో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నాయని మంత్రి హరీశ్రావు విమర్శించారు. యూ పీలో బీజేపీకి ఓటేయ్యకుంటే ఇండ్లను బుల్డోజర్లతో తొక్కిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, దీనిపై ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజల మధ్యన చిచ్చుపెడుతున్న ఆ పార్టీనే బుల్డోజర్లతో తొక్కి, భూస్థాపితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అమాయక ప్రజలను రెచ్చగొడుతూ, మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు మనకు అవసరంలేదని ప్రజలు నిర్ణయించుకున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మనుగడ సాధించలేవన్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేసిన దాతలను మంత్రి హరీశ్రావు అభినందించారు. అనంతరం వివిధ మండలాలకు చెందిన పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరగా, వారికి మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం సభకు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హజరై కార్యక్రమాన్ని విజయవతం చేయాలన్నారు.
నియోజకవర్గం నుంచి 50వేల మంది..
నారాయణఖేడ్లో నిర్వహించనున్న ఎతిపోతల పథకాల శంకుస్థాపన, సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి 50వేల మంది హాజరవుతారని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. నియోజకవర్గ రైతులు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారని, ఎతిపోతల ద్వారా మిగతా నియోజవర్గాల కంటే అందోల్కే ఎక్కువగా లబ్ధి చేకూరుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా అన్ని గ్రామాల నుంచి రైతులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు. సభకు జనసమీకరణ కోసం నియోజకవర్గస్థాయితో పాటు మండలానికో సమన్వయకర్తను నియమించామన్నారు. స్థానిక నేతలు కోఆర్డినేషన్తో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు మల్లయ్య, మురళీయాదవ్, ఏఎంసీ చైర్మన్లు మల్లికార్జున్, రజినీకాంత్, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, రాష్ట్ర నాయకులు హుదయ్కిరణ్, భిక్షపతి, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు పార్టీ నేతలు పాల్గొన్నారు.
.