చేర్యాల, జూలై 3: కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. మల్లన్నా.. మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది. మల్లన్నను సుమారు 10 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు.
అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరల వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో మల్లన్న ఆలయ ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకుడు శేఖర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.