మెదక్, జూలై 15 : పల్లెల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో పది రోజుల పాటు కొనసాగింది. ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమం 10వ తేదీ వరకు జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో నిర్వహించారు. ఏడో విడుత హరితహారంలో మొక్కలు నాటారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ప్ర త్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. పల్లెల్లో డ్రైనేజీలు శుభ్రపర్చడం, వంగిన విద్యుత్ స్తంభాలు తొలిగించడం, పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలను సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన ట్రాక్టర్లతో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించారు.
పల్లె ప్రగతిపై కలెక్టర్ దిశా నిర్దేశం..
పల్లె ప్రగతి పురస్కరించుకొని గ్రామాల్లో అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్ హరీశ్ సమావేశం నిర్వహించి, దిశా నిర్దేశం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీలు తమ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. జిల్లాలోని 469 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో 13,695 రోడ్లు, 10,583 మురుగు కాల్వలను శుభ్రం చేశారు. గుంతలున్న 1,644 ప్రాంతాలను చదును చేశారు. 469 వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 7,12,016 మీటర్ల మేర రోడ్డు కిరువైపులా మొక్కలు నాటడానికి గుంతలు తీసి 2,61,764 మీటర్ల మేర మొక్కలు నాటారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున 1,18,846 ఇండ్లకు 7,41,010 పండ్లు, పూలు, ఇతర మొక్కలు అందజేశారు. ఖాళీ స్థలాలుగా గుర్తించిన 3,37,487 ప్రాంతాల్లో మొక్కలు నాటారు. వివిధ ప్రాంతాల్లో 2,198 తుప్పు పట్టిన,వంగిపోయిన కరెంటు స్తంభాలను గుర్తించి 907 సానాల్లో మరమ్మతులు చేసి కొత్తవి మార్చారు.
పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధులు..
పల్లెల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశా రు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి నియోజవకర్గంలోని అన్ని గ్రామాలను పర్యటిస్తూ పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.
జిల్లాలో పల్లె ప్రగతి విజయవంతం
జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు నిరంతరం కొనసాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ నిర్దేశించిన పనులు పూర్తి చేశాం. ఈ ఏడాది పల్లె ప్రగతిలో జిల్లా ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలు, యువకులు ఎక్కువగా భాగస్వామ్యమయ్యారు.
– తరుణ్కుమార్, డీపీవో మెదక్