జహీరాబాద్, ఆగస్టు 30 : టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ అన్నారు. ప్రతి గ్రామంలో జెండా పం డుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి సంస్థాగత నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 20 వరకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కొత్త కమిటీలో సామాజిక న్యాయం పాటించేలా అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందన్నారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు గ్రామస్థాయిలో జెండాలు ఆవిష్కరణ చేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. జహీరాబాద్ పట్టణ, మండల, కోహీర్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.