పల్లెలన్నీ ప్రగతి వైపు దూసుకెళ్తున్నాయి. ఒకప్పుడు గుంతల రహదారులు, రోడ్లపై మురుగు నీరు, చెత్తా చెదారంతో కనిపించిన ఆ గ్రామం ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో పాతూరు కొత్త సొబగులను అద్దుకున్నది. ఎటు చూసినా పచ్చదనం, పరిశుభ్రత కనువిందు చేస్తున్నాయి. గ్రామంలోని సమస్యలు దూరం చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నది.
మెదక్ రూరల్, మార్చి 30: మండల పరిధిలోని పాతూరు గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పాతూరు గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఇందులో భాగంగా గ్రామంలో నూతన పంచాయతీ భవనం, వైకుంఠధామం నిర్మిస్తున్నారు. గ్రామంలో వంద శాతం పరిశుభ్రతను పాటించేలా చర్యలు చేపడతున్నారు. ఇందుకోసం ఎంజీఎస్ఆర్ఈజీఎస్ నిధులతో డంపింగ్యార్డు నిర్మించి వర్మీకంపోస్టును తయారు చేస్తున్నారు. గ్రామంలోని గల్లీగల్లీకి సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు పల్లెప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు చేశారు. చెత్త సేకరణకు ట్రాక్టర్ను ఏర్పాటు చేయగా, ట్యాంకర్ ద్వారా హరితహారం మొక్కలకు నీరు పడుతున్నారు. చిన్నచిన్న వీధుల్లోకి చెత్త రిక్షాలు ఏర్పాటు చేసి చెత్తను తరలిస్తున్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. గ్రామంలో పలు విడుతల్లో నాటిన హరితహారం మొక్కలను గ్రామ పాలకవర్గం, గ్రామస్తులందరూ కలిసి సంరక్షించడం ద్వారా ప్రస్తుతం ఆ మొక్కలన్నీ పచ్చగా కళకళలాడతున్నాయి. గ్రామంలో తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా నీటిని అందిస్తున్నారు. సుమారు 659 నల్లా కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. ఎక్కడ కూడా అపరిశుభ్రంగా కనిపించకుండా డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టారు. గ్రామ పాలకవర్గం, అధికారులు ప్రణాళిక బద్ధంగా పల్లె ప్రగతి పనులను నిర్వహిస్తూ మండలంలోనే పాతూరును ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు.
పల్లెప్రగతితో ప్రయోజనం
ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది. రోజూ ట్రాక్టర్లో చెత్తను తరలిస్తున్నం. ఇంతకు ముందు రోడ్లు, ఇండ్ల పక్కన ఎక్కువగా చెత్త ఉండేది. పల్లెప్రగతి కారణంగా రోడ్లపై చెత్త వేయడం లేదు. దీంతో ఊరంతా శుభ్రంగా మారింది. గ్రామంలోని ప్రతి వీధిలో సీసీరోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేశాం. ఇంటింటికీ భగీరథ నీరందిస్తున్నాం.
అందరి సహకారంతో..
గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నరు. పల్లెప్రగతితో గ్రామస్తుల్లో అవగాహన పెరిగింది. ప్రభుత్వం నిధులు సమకూర్చడంతో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాయి.
అభివృద్ధి పనులు..
పాతూరు గ్రామంలో రూ.22 లక్షలతో రైతు వేదిక నిర్మించారు. ఈ భవనాన్ని మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. రూ.13 లక్షలతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనం చివరి దశలో ఉన్నది. అన్ని హంగులతో నిర్మిస్తున్న ఈ భవనం త్వరలోనే ప్రారంభం కానున్నది. రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.6 లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. పచ్చదనం నిర్వహణకు రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన నర్సరీ, రూ.10 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామానికి రూ.5 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ కోసం రూ.1.60 లక్షలు, వాటర్ ట్యాంకర్ కోసం రూ.1.66 లక్షలను కేటాయించారు.
ఇవీ కూడా చదవండి..