మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 28 : మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడటంతో జిల్లా ప్రజలు రాకపోకలు ఎక్కువ కావడంతో ప్రధాన రోడ్లతో పాటు పట్టణంలోని అంతర్గత రోడ్లు సైతం రద్దీగా మారాయి. ముఖ్యంగా మార్కెట్ రోడ్డు ఎల్లావేళల రద్దీగా ఉండి వాహనాలతో పాటు పాదచారులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కూరగాయల మార్కెట్లో కావాల్సిన స్థలం లేకపోవడంతో కూరగాయల వ్యాపారులు, రైతులు తాము పండించిన కూరగాయలు, పండ్లు తదితర వాటిని రోడ్డుకు ఇరువైపులా పెట్టుకొని అమ్మకాలు జరపడం ద్వారా నిత్యం ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
మార్కెట్ రోడ్డు గుండా వెళ్లలాంటే జనాలు జంకుతున్నారు. చిరు వ్యాపారుల, జనాల ఇబ్బందుల దృష్యా మున్సిపల్ పాలకవర్గం పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ వెనుకల మినీ రైతుబజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. పట్టణ ప్రగతి నిధులు కింద రూ. 35లక్షల అంచనాతో చిరు వ్యాపారులకు అవకాశం కల్పించేలా 4 నెలల క్రితం నిర్మాణాలను చేపట్టింది. పనులు పూర్తికాగానే ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభిస్తారని పాలకవర్గం తెలిపింది. దీంతో మార్కెట్ వద్ద రద్దీ తీరనుంది.
రైతుబజార్ పనులు దాదాపు పూర్తయ్యాయి. అందుబాటులోకి రాగానే మార్కెట్ రోడ్డులో ఇబ్బందులు తొలిగిపోతాయి. జిల్లా కేంద్రం ఏర్పడటంతో పట్టణ విస్తీర్ణం పెరిగింది. పట్టణానికి కూరగాయల మార్కెట్ ఒక్కటే ఉండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మినీ రైతుబజార్ ఏర్పడటంతో కొద్ది గా ఇబ్బందులు తొలగనున్నాయి. మున్ముందు పట్టణంలో మినీ రైతు బజా ర్లు ఏర్పాటు చేయడానికి పాలకవర్గం కృషి చేస్తోంది.
– చంద్రపాల్, మున్సిపల్ చైర్మన్
మినీ రైతుబజార్ అందుబాటులోకి రాగానే మా ర్కెట్ రోడ్డులో ఇబ్బందులు తొలగిపోతాయి. చిరు వ్యాపారులు, ప్రజలకు ఎంతో మేలు జరుగనుంది. పట్టణం పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసే అవశ్యకత ఉంది.
– జానకిరాం సాగర్, మున్సిపల్ కమిషనర్