నేడు సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు
రెండు రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు
రక్తదానం చేసిన మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు,పార్టీ శ్రేణులు
నేడు చింతమడక నుంచి గజ్వేల్ వరకు ‘రన్ ఫర్ కేసీఆర్’ కార్యక్రమం
నేడు సిద్దిపేటలో కేసీఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
గజ్వేల్లో క్రీడా పోటీలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
సిద్దిపేట, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చి.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. జనహృదయ నేత, జలప్రధాత కేసీఆర్ పుట్టినరోజును ఊరూవాడ ఘనంగా నిర్వహించేందుకు అన్నివర్గాలు సిద్ధమయ్యాయి. నేడు ఆ మహానేత పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు గులాబీదండు సిద్ధమైంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు రోజులుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నేడు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మెతుకు సీమ ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. సాగు, తాగునీటి గోస తీరుతున్నది. పథకాలు పక్కాగా అమలవుతున్నాయి. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుండడంతో వేనోళ్లు సీఎం కేసీఆర్ను దేవుడిలా కొలుస్తున్నారు.
సీఎం కేసీఆర్ పుట్టిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. మంగళవారం అన్నదానం, పండ్ల, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేయగా, బుధవారం పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్లో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, దుబ్బాక దవాఖానలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి రక్తదాన శిబిరాలను ప్రారంభించి, రక్తదానం చేశారు. గజ్వేల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, హుస్నాబాద్లో ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మెదక్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, మనోహరాబాద్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మెక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత, సంగారెడ్డిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, పటాన్చెరువులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, అందోల్లో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు రక్తదాన శిబిరాలను ప్రారంభించారు.
ప్రభుత్వ దవాఖానలో పండ్ల పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ రెండు రోజుల పాటు అన్నదానాలు, వృద్ధ, అనాథాశ్రమాలు, దవాఖానలో పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. గురువారం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థన మందిరాల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. వీటితో పాటుగా ఎవరికి తోచిన విధంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చింతమడక నుంచి గజ్వేల్ వరకు 68 కిలో మీటర్ల రన్ఫర్ కేసీఆర్ కార్యక్రమాన్ని శాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆకాంక్షను నెరవేర్చిన నేతకు ఘన స్వాగతం పలుకుదాం
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నదని, జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలుకుదామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం సంగారెడ్డి ఎంబీఆర్ గార్డెన్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 20 వేల మందిని తరలించి సభను విజయవంతం చేద్దామన్నారు. గోదావరి నీళ్లు తెచ్చి, సంగారెడ్డిని సస్యశ్యామలం చేస్తామన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారన్నారు. రూ.4500 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. సంగారెడ్డికి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తీసుకెళ్లారని కొందరు మూర్ఖులు ఆరోపణలు చేశారని, రాష్ట్రంలోనే శరవేగంగా సంగారెడ్డి కాలేజీ నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. మెడికల్ కాలేజీలో 1200 ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు.
హామీ ఇవ్వకపోయినా రూ. 50కోట్లతో సంగారెడ్డిలో నర్సింగ్ కళాశాలను మం జూరు చేసిన దయగళ్ల సీఎం మన కేసీఆర్ అన్నారు. సొంత స్థలాలు ఉన్నవారందరూ ఇండ్లు కట్టుకునేందకు ఏప్రిల్ నుంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. మార్చి లేదా అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం కేసీఆర్ సంగారెడ్డి పర్యటన ఉంటుందని, మెడికల్, నర్సింగ్ కళాశాలల ప్రారంభం, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణి క్యం, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి..
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ ఈ నెల 21న జిల్లాకు రానున్నందున అధికారులందరూ సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా శాఖల ప్రభుత్వ అధికారులతో సమావేశమై, సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడారు. జిల్లాలో సాగునీరు అందించేందుకు రూ. 4500 కోట్లు ఖర్చు చేసి అతి పెద్ద ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా అధికారులు బాధ్యతగా పని చేసి, తమకు కేటాయించిన పనులను చేయాలని సూచించారు. సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సహకరించాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఆర్వో రాధికారమణి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.