సిద్దిపేట, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతన్నకు దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తున్నది. వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. రైతుల ముంగిటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు. సేకరించిన ధాన్యాన్ని వెనువెంటే రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది.
ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం కొర్రిలు పెట్టినా, రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని, ధాన్యం కొంటున్నది. సిద్దిపేట జిల్లాలో 416 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయ గా, ఇప్పటి వరకు ధాన్యం సేకరణ పూర్తి చేసిన 13 కేంద్రాలను మూసివేశారు. కాగా, జిల్లాలో ఇప్పటి వర కు 60,008 మంది రైతుల నుంచి 2,65,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. ఈ ధాన్యం విలువ రూ. 521.43 కోట్లు కాగా, ఇప్పటి వరకు రైతుల ఖాతాలో రూ.426.97 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగాన్ని మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేస్తున్నారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఇటు రైతులు తమ వానకాలం ధాన్యం అమ్ముకోవడంతో పాటు అటు యాసంగి సాగుపై దృష్టి సారించారు. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి రైతులకు నిర్దేశించి గడువులోగా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. కాగా, ధాన్యం కొనుగోళ్లలో జిల్లా ముందంజలో ఉంది. ఆన్లైన్లో సైతం మిగతా జిల్లాల కన్న ముందు వరుసలో ఉంది. 416 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో మహిళా సంఘాల ద్వారా 221కేంద్రాలను ప్రారంభించారు. వీటిలో 5 కేంద్రాల్లో ధాన్యం పూర్తిస్థాయిలో అయిపోవడంతో వాటిని మూసేశారు. ఇప్పటి వరకు 33,413 మంది రైతుల వద్ద నుంచి 1,46,406 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. దీని విలువ రూ. 301.60 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ. 277.58 కోట్లకు సంబంధించిన ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశారు.
ట్రక్ షీట్కు సంబంధించి రూ.255.69 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రైతులకు రూ.224.17 కోట్లు చెల్లింపులు చేశారు. ఇంకా రూ.77.43 కోట్లు చెల్లించాల్సి ఉంది. సహకార సంఘాల ద్వారా 190 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 8 కేంద్రాలను మూసి వేశారు. ఇప్పటి వరకు వీరు 25,533 మంది రైతుల నుంచి 1,14,225 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. ఈ ధాన్యం విలువ రూ.235.30 కోట్లు కాగా, రూ. 222.39 కోట్లకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీ చేశారు. ట్రక్ షీట్ రూ.208.98 కోట్లకు ఇచ్చారు. దీంతో రైతులకు రూ.192.96 కోట్లు చెల్లించారు. రూ. 42.34 కోట్లు చెల్లించాల్సి ఉంది. మెప్మా ద్వారా 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1062 మంది రైతుల నుంచి 4,869 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.
దీని విలువ రూ. 10.03 కోట్లు కాగా. ట్యాబ్ ఎంట్రీని రూ. 9.91 కోట్లు చేశారు. ట్రక్ షీట్ రూ.10.05 ఇచ్చి రైతులకు రూ.9.83 కోట్లు చెల్లించారు. మొత్తంగా జిల్లాలో 60, 008మంది రైతుల నుంచి 2,65,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. సేకరించిన ధాన్యం విలువ రూ. 546.93 కోట్లు కాగా, ట్యాబ్ ఎంట్రీ రూ.511.93 కోట్లు చేశారు. ట్రక్ షీట్ రూ.474.72 కోట్లకు సంబంధించి రైతులకు ఇచ్చారు. రైతుల బ్యాంక్ ఖాతాలో ధాన్యం డబ్బులను రూ.426.97 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. రూ. 119.97 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా రాష్ట్ర ప్రభు త్వం అన్ని రకాల చర్య లు తీసుకుంటుంది.
ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూస్తున్నారు మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేర కు జిల్లాల అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ఎప్పటికప్పుడు సందర్శించి ధాన్యం కొనుగోలు, టాబ్ ఎంట్రీ, లోడింగ్, అన్లోడింగ్ అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
నాకు రెండున్నర ఎకరాల ఎవుసం ఉంది. అండ్ల 189బస్తాల వడ్లు అయినయి. వడ్లు తీసుకపోంగనే జెల్దినే కాంట పెట్టిండ్రు. పైసలు కూడ పదిరోజల లోపే వచ్చినయి. ఏం ఇబ్బందిలేకుండా మంచిగనే కొంటం డ్రు. పైసలు కూడ జెప్పన్నే ఇస్తండ్రు.
– సుంకరి మల్లయ్య, రైతు, హుస్నాబాద్టౌన్
రాయపోల్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారానే మద్దతు ధర లభించింది. గత ప్రభుత్వాల హయాంలో ధాన్యం అమ్ముకోవాలన్నా అనేక ఇబ్బందులు ఉండేవి. సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో దళారులు పాత్ర లేదు. 93 క్వింటాళ్లు కాగా, వాటికి రూ.93వేలు రాయపోల్ సెంట్రల్ బ్యాంక్లోని నా ఖాతాల్లో జమ అయ్యాయి. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు రైతులు ఎల్లాప్పుడు రుణాపడి ఉంటాం.
-తూర్పు యాదగిరి, ఉదయపూర్ గ్రామం (రాయపోల్ )
అడ్లు అమ్మని రెండు రోజులకే సీఎం కేసీఆర్ సార్ నాకు అడ్ల పైసలను జెప్పన ఏసీండు. గిప్పుడూ మల్లా యాసంగి పంటను ఎయ్యాడినికి రైతులు ఎలాంటి నట్టం లేదు. గప్పుడైతే వారం పదిగేను రోజులైనా అడ్ల పైసలు పడేటప్పటికి శాన కట్టం అయ్యేది. ఏటేటా గింత మంచిగా రైతులకు అన్ని ఇదాలు ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నా.
-ర్యాకం చంద్రం, రైతు, మిరుదొడ్డి
వానకాలం ధాన్యం కాంట అయిన తర్వాత వారం రోజుల్లో డబ్బులు పడ్డాయి. సీఎం కేసీఆర్ రైతు బాగు కోసం పనిచేస్తున్నాడు. యాసంగిలో కూడా ఢిల్లీ పాలకులు ధాన్యం కొనము అని చెప్పినా, ఎంత నష్టమైనా రైతులకు నష్టం కలుగనియ్యమని ధాన్యం కొనుగోలు చేసి భరోసా ఇచ్చారు. 26.80 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి రాగా, రూ.55,208 నా బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. సీఎం సీఆర్ సార్ రైతు గుండెల్లో నిలిచిపోయారు.
-సుతారి రాములు , రైతు, వెంకట్రావుపేట (తొగుట)