దుబ్బాక, ఫిబ్రవరి16 : ‘నూటికో…కోటికో ఒక్కరూ.. సీఎం కేసీఆర్ లాంటి నాయకులు పుడుతారు’. తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు. కారణ జన్ముడిగా అవతరించాడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా బుధవారం దుబ్బాక ప్రభుత్వ దవాఖానలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రారంభించి రక్తదానం చేశారు. అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గురువారం దుబ్బాకలో బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు, చర్చి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలతోపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
23న తొగుటకు సీఎం కేసీఆర్..
ఈ నెల 23న తొగుటకు సీఎం కేసీఆర్ రానున్నట్లు ఎంపీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభ ఉంటుందన్నారు. నియోజకవర్గంలో రైతులకు సాగు నీటి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ కుట్రలు..
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు ప్రభుత్వంపై లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం బాధాకరమన్నారు. బీజేపీకి ఎజెండా లేదని, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తామని కూడా చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని గుర్తు చేశారు. ఝూటా పార్టీగా మారిన బీజేపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ బండి శ్రీలేఖారాజు, వైస్ చైర్మన్ లక్ష్మణ్రావు, పీఏసీఎస్ చైర్మన్ కైలాశ్ , కౌన్సిలర్లు దేవుని లలిత, నిమ్మ రజిత, బంగారయ్య, శ్రీనివాస్, స్వామి, కనకయ్య, బాలకృష్ణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
లచ్చపేట వార్డులోగంగపుత్రలకు గుర్తింపు కార్డులు అందజేత..
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డులో గంగపుత్ర సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులను ఎంపీ ప్రభాకర్రెడ్డి అందజేశారు. అనంతరం శ్రీసంత్ గురు రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గొని స్మృతివనం, బ్రిడ్జి తదితర వాటిని ఆయన పరిశీలించారు. గోసాన్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ దొందడి లక్ష్మి, ఎంపీటీసీ పోలబోయిన లక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్లు, నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.