మెదక్, ఫిబ్రవరి 13 : దళితులు గెలిచి తీరాలి.. గౌరవంగా బతకాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని, దళితుల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్లోని జీకేఆర్ గార్డెన్స్లో దళితబంధుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, అందోల్ నియోజకవర్గాల నుంచి మొదటి లబ్ధిదారుల జాబితాలో 256 మందికి రావడం అదృష్టమన్నారు. ‘సీఎం కేసీఆర్ కల మీరు గెలిచి తీరాలి.. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి.. సభ్య సమాజంలో మీరు కూడా గౌరవంగా బతకాలన్నదే’ ముఖ్యమంత్రి కల అని అన్నారు. కలలో కూడా రూ.10 లక్షలు వస్తాయని అనుకుంటామా… అలాంటిది దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రమైనా దళితులకు రూ.10 లక్షలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిందా అని లబ్ధిదారులను సూటిగా ప్రశ్నించారు. క్షణంలో కాని పనిని నిజం చేసిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంట్లో కూర్చొన కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ గెలువాలి, నిలబడాలని మంత్రి లబ్ధిదారులకు సూచించారు.
మార్చి తర్వాత 2వేల మందికి దళిత బంధు
ప్రస్తుతం మొదటి విడుతలో ప్రతి నియోజకవర్గానికి వంద మందికి దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తున్నామని, మార్చి తర్వాత నియోజకవర్గంలో 2000 వేల మందికి దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాలో మొదటి విడుతలో 256 మందికి దళిత బంధు పథకాన్ని అందజేస్తున్నామని చెప్పారు. దళిత బంధు కింద ఏర్పాటు చేసుకునే యూనిట్లకు సంబంధించి ఎలాంటి దరఖాస్తు చేసుకున్నా వెంటనే వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఫర్టిలైజర్ షాపు పెట్టుకుంటే వ్యవసాయశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా ఆటో, డీసీఎం ఇతర వాహనాలు కొనుగోలు చేస్తే వెంటనే లైసెన్స్లు జారీ చేయాలని అక్కడే ఉన్న డీటీవో శ్రీనివాస్గౌడ్ను ఆదేశించారు. దళారులను నమ్మవద్దని, పైరవీకారులకు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవద్దని లబ్ధిదారులకు సూచించారు. దళిత బంధు పథకం కింద ఎన్ని యూనిట్లు అయినా ఏర్పాటు చేసుకోవచ్చని లబ్ధిదారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దళిత బంధు రూ.10 లక్షలతో ఒక్కో కుటుంబంలో మూడు నుంచి నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.
అంతేకాకుండా ఒక కిరాణా షాపును మెదక్ జిల్లాలోనే కాకుండా హైదరాబాద్ లేదా సిద్దిపేట, తూప్రాన్ ఇలా ఎక్కడైనా యూనిట్లు పెట్టుకోవచ్చన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని, సందేహాలు ఉంటే ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఆర్డీవోల సలహాలు, సూచనలు తీసుకోవచ్చన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 64 మంది కార్లు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు, అందరు కూడా కార్లు కాకుండా రకరకాల యూని ట్లు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో ఇచ్చే రూ.10 లక్షల్లో లబ్ధిదారుడికి రూ.9.90 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని మంత్రి తెలిపారు. అయితే లబ్ధిదారుడి వాటా రూ.10వేలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.10వేలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందన్నారు. సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, మురళీయాదవ్, దళిత బంధు ప్రత్యేకాధికారులు సాయిరామ్, నర్స య్య, డీఎస్డీవో విజయలక్ష్మి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు.