సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 16: సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 24వ తేదీ వరకు మహాత్మా గాంధీ చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు జిల్లాలోని 11 థియేటర్లలో మొత్తం 5,465 మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్ని తిలకించారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని 11 థియేటర్లలో ఉచితంగా చలన చిత్ర ప్రదర్శన చేపట్టినట్టు తెలిపారు. 2022లో వజ్రోత్సవ ప్రారంభ సమయంలోనూ విద్యార్థులతో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా గాంధీ చిత్రాన్ని సీఏం ఆదేశాల మేరకు ఉచితంగా ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 16 నుంచి 24 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.
20వ తేదీ ఆదివారం చిత్ర ప్రదర్శన ఉండదని స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని సితారా థియేటర్లో 520 మంది, నటరాజ్లో 450 మంది, రుక్మిణీ థియేటర్లో 430, జహీరాబాద్లోని సినీ మ్యాక్స్లో 280, శ్రీమోహన్ థియేటర్లో 700, సదాశివపేటలోని మహేశ్వరిలో 680, నారాయణఖేడ్లోని శ్రీవెంకటేశ్వరలో 510, సువర్ణలో 435, పటాన్చెరులోని శివరంజని డీలక్స్లో 480, ఎస్వీ సినీ స్కేర్ థియేటర్లో 480, గుమ్మడిదల వెంకటేశ్వర థియేటర్లో 350 మంది విద్యార్థులు జాతిపిత మహాత్మా గాంధీ చలన చిత్రాన్ని తిలకించారని వివరించారు. థియేటర్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జిల్లాలో ఈ నెల 24 వరకు ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా దేశ భక్తి పెంపొందుతుందని కలెక్టర్ కోరారు.