సంగారెడ్డి, జూలై 12: బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఆవులు, లేగదూడలు అమ్మినా, రవాణా చేసినా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ వ్యాపారులను హెచ్చరించారు. సోమవారం పట్టణ సమీపంలోని పశువుల సంతను సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా పశువులను రవాణా చేయడం నేరమన్నారు. నోరులేని మూగజీవాలను రక్షించుకుంటే భవిష్యత్ తరాలకు వ్యవసాయానికి ఉపయోగపడుతాయన్నారు. ఎద్దులు, గేదెలు అమ్ముకోడానికి అవకాశం ఉందని, ఆవులు, లేగ దూడలను అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించి ఆవులు, లేగదూడలను అమ్మినట్లయితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. డీఎస్పీ వెంట రూరల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్సై సుభాష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
గోవులను తరలిస్తే చర్యలు తప్పవు
మునిపల్లి, జూలై 12 : బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ బాలాజీ అన్నారు.సోమవారం మండల పరిధిలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట కొండాపూర్ సీఐ లక్ష్మారెడ్డి, మునిపల్లి ఎస్సై మహేశ్వర్రెడ్డి ఉన్నారు.
అక్రమ తరలింపు పై పోలీసుల నిఘా
చౌటకూర్, జూలై 12 : గోవులను అక్రమంగా తరలించే వారి పై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ అన్నారు. మండల పరిధిలోని శివంపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను సందర్శించారు. వ్యవసాయ సాగు కోసం కొనుగోలు చేసి తీసుకు వస్తున్నా సరే రైతుల దగ్గర పశువుల సంత వద్ద ఇచ్చిన రశీదు తప్పనిసరి గా ఉండాలన్నారు. ఆయన వెంట పుల్కల్ ఎస్సై నాగలక్ష్మి , సిబ్బంది ఉన్నారు.
ముమ్మరంగా పోలీసుల వాహనాల తనిఖీలు
న్యాల్కల్, జూలై 12: ఇతర రాష్ట్రాల నుంచి పశువులను రాష్ట్రంలోకి అక్రమంగా తరలించకుండా అడ్డుకునేందుకు పోలీసులు సోమవారం ముమ్మరంగా వాహనాలను తనిఖీలు చేపట్టారు. జహీరాబాద్ రూరల్ సీఐ నాగేశ్వర్రావు, హద్నూర్ ఎస్సై వినయ్కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని గంగ్వార్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును కర్ణాటక, మహారా్రష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా పశువులను తరలించకుండా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కార్యక్రమంలో ఏఎస్సైలు ఈశ్వర్, జగదీశ్వర్, పోలీసులు పాల్గొన్నారు.