సిద్దిపేట, జూలై 22 : రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. చెరువులు.. చెక్డ్యాంలు మత్తళ్లు దూకుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 5.44 సెంటిమీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలంలో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షం కురిసింది. బెజ్జంకి మండలంలో అత్యల్పంగా 3.37సెం.మీ ల వర్షం కురిసింది. దుబ్బాకలో 7.2, చిన్నకోడూర్లో5.6 ,కోహెడలో4.2 ,హుస్నాబాద్లో 4.2, అక్కన్నపేటలో 4.5, నంగునూర్లో 4.2, సిద్దిపేట అర్బన్లో 6.8, తొగుటలో 5.9, మిరుదొడ్డిలో 6.6, దౌల్తాబాద్లో4.0, రాయపోల్లో4.5, వర్గల్లో 4.9, ములుగులో 3.6, మర్కుక్లో 4.2, జగదేవ్పూర్లో 4.9,గజ్వేల్లో 4.2, కొండపాకలో 6.8, కొమురవెల్లిలో 6.6, చేర్యాలలో 3.8, మద్ద్దూరులో 5.3, నారాయణరావుపేటలో 8.8, ధూళిమిట్టలో5.6 సెం.మీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లా తడిసి ముద్దయ్యింది. మెదక్ జిల్లాలో 3.4 సెంటీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా నార్సింగి మండలంలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లాలో 2516 చెరువులు ఉండగా, 163 చెరువులు నిండాయి. 77 చెరువులు అలుగు పారుతున్నాయి. వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న చెరువులు 268 ఉండగా, వంద ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్న చెరువులు 2,248 ఉన్నాయి. జిల్లాలో హల్దీవాగుపై 32 చెక్డ్యాంలు, మంజీర నదిపై 2 రెండు చెక్డ్యాంలు ఉన్నాయి. అవన్నీ జలకళ సంతరించుకున్నాయి. అత్యధికంగా నార్సింగి మండలంలో 5.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్నశంకరంపేటలో 5.1, నిజాంపేటలో 4.9, రామాయంపేట, హవేళీఘనపూర్లో 4.6, తూప్రాన్లో 4.3, మెదక్, కొల్చారం మండలాల్లో 3.4, శివ్వంపేటలో 3.2, మాసాయిపేటలో 4.6, నర్సాపూర్లో 3.1, కౌడిపల్లిలో 3, టేక్మాల్లో 3, మనోహరాబాద్లో 2.7, చిలిపిచెడ్లో 2.1 వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, వాగులు జలకళను సంతరించుకుంటున్నాయి. సింగూరు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతున్నది. నారింజ, నల్లవాగు ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 2.1 సెంటీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. గురువారం జిల్లాలో అత్యధికంగా గుమ్మడిదలలో 3.5 సెం.మీ టర్ల వర్షపాతం నమోదైంది. అందోలు మండలంలో 3.2, కంగ్టి మండలంలో 3, మనూరు, కల్హేర్ మండలాల్లో 2.8, సిర్గాపూర్లో 2.7, జహీరాబాద్లో 2.6, కోహీర్, మొగుడంపల్లి మండలాల్లో 2.5, పుల్కల్, హత్నూర మండలాల్లో 2.3 సెం.మీటర్ల చొప్పున వర్షం కురిసింది. మిగతా మండలాల్లో ఒకటి నుంచి 2 సెం.మీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు.
ప్రాజెక్టులు, చెరువులకు జలకళ
నల్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్నది. జహీరాబాద్ మండలం కొత్తూరు(బి)లోని నల్లవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండిది. ప్రాజెక్టు గేట్లపై పైనుంచి వరద దిగువన కర్ణాటకకు వెళ్తున్నది. మనూరు మండలంలోని కమలాపూర్, గట్టులింగంపల్లి, కంగ్టిమండలంలోని కాకివాగు సామలవాగు అలుగు పారుతున్నాయి.