శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ బొగ్గుగనిలో గురువారం 87 మంది కార్మిక పిల్లలకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంలో జీఎం సురేశ్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే. సురేందర్రెడ్డి, ఎం.సురేశ్లు వారికి నియామక పత్రాలను అందజేశారు. జీఎం మాట్లాడుతూ..సంస్థలో నూతనంగా చేరుతున్న యువ కార్మికులు క్రమ శిక్షణతో సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 2100 మందికి కారుణ్య ఉద్యోగాలు లభించాయని చెప్పారు. సింగరేణిలో ఉద్యోగాలు దొరకడం అదృష్టంగా భావించాలని సూచించారు. సంస్థ పట్ల అంకితభావంతో పని చేయాలని కోరారు.
కష్టపడ్డవారికి గుర్తింపు ఉంటుందన్నారు. నూతన కారుణ్య ఉద్యోగులుగా చేరుతున్న యువకుల్లో చాల మంది ఉన్నత విద్యార్హత ఉన్న వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. వారికి సంస్థలో మంచి భవిష్యత్తు ఉంటుదన్నారు. గైర్హాజరు లేకుండా పని చేయాలని కోరారు. మైనింగ్ స్టాఫ్గా, జూనియర్ అసిస్టెంట్లుగా, ఇతర క్యాటగిరీల్లో చేరవచ్చన్నారు. పనిలో నైపున్యత పెంపొందించుకోవాలని కోరారు. రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకతకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఓటూజీఎం కే హరినారాయణగుప్తా, డీవైజీఎం గోవిందరాజు, అధికారుల సంఘం కార్యదర్శి రాఘవేంద్ర రావు, ఈఈ కుమార్, డీవైజీఎం అరవిందరావు, డీవైపీఎం సుదర్శన్, సీనియర్ పీవో కాంతారావు, పిట్ కార్యదర్శి పీవీ రావు పాల్గొన్నారు.