నెన్నెల : గ్రామాల్లో కొవిడ్ టీకాల మందగమనంపై మంచిర్యాల కలెక్టర్ వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నెన్నెల, జెండావెంకటాపూర్ గ్రామాల్లో కొవిడ్ టీకా కేంద్రాలను జిల్లా కలెక్టర్ భారతి హోళి కేరి పరిశీలించారు టీకా వేయడంలో నిర్లక్ష్యం చేస్తే ఎవరినీ సహించేదిలేదని పేర్కొన్నారు. అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం లక్ష్యం చేరడంలేదని, నెన్నెలలో ఇంకా 1200 మందికి టీకా ఇవ్వాల్సి ఉందని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులను మందలించారు. గ్రామంలో టీకా వేసుకోని వారిని అప్రమత్తం చేసి వారిని టీకా వేసుకునే దిశగా చైతన్య వంతం చేయాలన్నారు.
అధికారులు పై అధికారులకు తప్పుడు నివేదిక ఇస్తున్నారని సర్పంచ్ తోట సుజాత తెలిపారు. గ్రామంలో టీకాపై పూర్తి సర్వే చేస్తామని కలెక్టర్ చెప్పారు. జండావెంకటాపూర్ లోని టీకా కేంద్రాన్ని పరిశీలించారు. వారం రోజుల వ్యవధిలో మొదటి డోసు వందశాతం పూర్తి కావాలని ఆదేశించారు. మొదటి డోసు తీసుకుని 83 రోజులు పూర్తయిన వారికి తప్పకుండా రెండవ డోసు ఇవ్వాలన్నారు. మొదటి, రెండవ డోసు తీసుకోని వారుంటే వారి రేషన్, పింఛన్ ఇవ్వమని చెప్పాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆమె వెంట ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.