చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి..
బాల్యవివాహాలను అడ్డుకోవాలి
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణకమిషన్ సభ్యుడు అరికెళ్ల దేవయ్య
సీసీసీ నస్పూర్, జూలై 14: కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అరికెళ్ల దేవయ్య సూచించారు. కరోనా మూడో దశ వ్యాప్తిపై మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ సింగరేణి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కరోనా కేసులు, బాలల పరిరక్షణ, లైంగిక దాడులు, బాల్య వివాహాలు తదితర అంశాలపై చర్చించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేస్తూ సంబంధిత అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కరోనా మొదటి, రెండో దశల్లో పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, మూడో దశ కొవిడ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు మనోధైర్యంతో ఉంటూ ప్రభుత్వ సూచనల మేరకు జాగ్రత్తలు పాటించాలని కోరారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు.కొవిడ్ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు లేకపోవడంతో పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వాటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాలల హక్కులను ఎవరైనా కాలరాస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సీడబ్ల్యూసీ మంచిర్యాల, నిర్మల్ జిల్లాల చైర్మన్ వాహిద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు, జిల్లా స్త్రీ శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి ఉమాదేవి, వైద్యాధికారులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.