మంచిర్యాల, అక్టోబర్ 26, నమస్తే తెలంగాణ : మూగజీవాలకు సత్వర వైద్యం అందించేందుకు తెలంగాణ సర్కారు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. టోల్ఫ్రీ నంబర్ 1962కు ఒక్కఫోన్ చేస్తే చాలు రైతులు కోరిన చోటుకు అంబులెన్స్ వచ్చి పశువులకు చికిత్స అందిస్తున్నది. సమైక్య పాలనలో పశువులు, గొర్రెలు, మేకలకు సీజనల్ వ్యాధులు ప్రబలితే వైద్యం కోసం దూర ప్రాంతాల్లోని పశు వైద్యశాలకు వెళ్లాల్సి వచ్చేది. రైతుల సమస్యలు గమనించిన సీఎం కేసీఆర్ 2017 సెప్టెంబర్ 17న సంచార వైద్య వాహనాలను ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గానికొకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. ఫలితంగా సకాలంలో వైద్యం అందుతున్నది. దీంతో పశువులు, జీవాల మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ యేడాదిలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో 45,618 జీవాలకు చికిత్స అందించారు.
పశువైద్యం.. రైతులకు వరం..
పశువులు, జీవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నరీతిలో అందిస్తున్న సంచార పశువైద్యం రైతులకు వరంగా మారింది. ప్రజలకు సాధారణ వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలు ఏర్పాటు చేసినట్లుగానే మూగజీవాల కోసం ప్రత్యేక వాహనాల ద్వారా చికిత్స అందిస్తున్నది. సమైక్య పాలనలో పశువులు, గొర్రెలు, మేకలకు సీజనల్ వ్యా ధులు వస్తే సత్వరమే వైద్యం అందేది కాదు. దీంతో పెంపకందారులు చాలా ఇబ్బందులెదుర్కొనేవారు. పక్క మండలాల్లోని పశువుల దవాఖానకు జీవాలను తీసుకెళ్లాల్సి వచ్చేది. పెంపకందారుల ఇబ్బందులు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంచార వైద్యవాహనాలను ప్రారంభించారు. ఫలితంగా పై సా ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందిస్తున్నా రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని పది నియోజకవర్గ కేంద్రాల్లో సంచార వాహనాలు (అంబులెన్స్ లు) ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనంలో పశువైద్యుడు, ఇద్దరు సహాయకులు, ఓ పైలట్ ఉంటారు. ఈ యేడాదిలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 45,618 మూగ జీవాలకు చికిత్స అందించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 7,924, నిర్మల్లో 19,294, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 6,519, మంచిర్యాల జిల్లాలో 11,881 పశువులకు సేవలందించారు.
అత్యాధునిక వైద్యం
పశుసంచార వైద్యశాలల్లో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. కేవలం ఒక్క ఫోన్ కాల్తో సంచార పశు వైద్య వాహనం అరగంటలో పశువులు, గొర్రెల మంద వద్దకు చేరుకుంటుంది. పశువులకు ఏ వ్యాధిసోకినా చికిత్సలు అందించేందుకు సుమారు 129 రకాల మందులు ఉన్నాయి. స్పెర్మ్ నిలువ చేసే కంటేనర్, హీటర్, మైక్రోస్కోప్, సర్జికల్ కిట్, రక్తపరీక్ష ల్యాబ్, క్రైమోకన్లాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు 108 మాదిరిగా మూగజీవాలకు సైతం వైద్య సేవలందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్స్లో అత్యవసర సమయంలో అందించేందుకు ఆక్సిజన్ సెట్ అందుబాటులో ఉంది. ఈ ఆక్సిజన్ సిలిండర్ ద్వారా చిన్నజీవాలకు మాత్రం అత్యవసరంగా వైద్యం చేయవచ్చు. పెద్ద వాటికి మాత్రం ఈ ఆక్సిజన్ అందించరు. కుక్కలు, గొర్రెలు, మేకలు, తదితర చిన్న జీవాలకు ఆక్సిజన్ అందించవచ్చు. అలాగే అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఉపయోగించేందుకు ఫైర్ సేప్టీ సిలిండర్ కూడా ఇందులో ఉంటుంది.
తగ్గిన పశువుల మరణాలు
సంచార పశువైద్యంతో గ్రామాల్లో మంచి ఫలితాలొస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు సంచార పశువైద్యంతో పశువుల మరణాలు గణనీయంగా తగ్గాయి. రైతులు ఫోన్ చేసినప్పుడు కొద్ది సమయంలోనే అంబులెన్స్ చేరుకొని వైద్యం అందిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కుక్కలతో పాటు వన్యప్రాణులైన నెమళ్లు, కోతులు, కుందేళ్లు, కోళ్లకు సైతం వైద్య సేవలందిస్తున్నారు.
సమస్యలు తగ్గాయి..
1962 నంబర్కు ఫోన్ చేసిన అరగంటలో సంచార వైద్యం అందించే వాహనం వారి వద్దకు వెళ్తుంది. దీని సేవలను రైతులు విరివిగా వినియోగించుకుంటున్నారు. మెరుగైన వైద్యం అందుతుండడంతో సమస్యలు తగ్గాయి. ఈ యేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో 45,618 జీవాలకు వైద్యం అందించాం.
సత్వర సేవలు..
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంచార పశువైద్యం ఎంతో మేలు చేస్తున్నది. ఫోన్ కాల్తో మంద వద్దకు అంబులెన్స్ వెళ్లి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తున్నది. పల్లెల్లో అనేక మంది రైతులు ఊరి నుంచి పశువులను తీసుకొని సమీప వైద్య శాలకు వెళ్లలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతున్నది.
v చాలా సహకరిస్తున్నారు..
1962 వాహనానికి ఫోన్ చేయగానే త్వరలోనే వారి వద్దకు చేరుకుంటున్నాం. పశువుల పరిస్థితిని పరీక్షించి వైద్యం అందిస్తున్నాం. అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నాం. పశువులకు ఆపద వచ్చినప్పుడు, చికిత్స అందించే సమయంలో యజమానులు చాలా సహకరిస్తున్నారు. దీంతో వైద్యం సులువుగా చేయగలుగుతున్నాం. – డాక్టర్ సంధ్య, పశువైద్యురాలు, ఆసిఫాబాద్