నాగర్కర్నూల్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : గుడిపల్లి రిజర్వాయర్ గతేడాది ఇదే సమయంలో నిండుకుండలా కృష్ణమ్మ పరుగులు తీయగా.. నేడు నీళ్లు అడుగంటి వట్టిపోయింది. వేసవి రాకముందే నీళ్లు అడుగుల్లోతుకు చేరాయి. నాడు రిజర్వాయర్లోని కాల్వల గుండా మార్చి వరకు నిండుగా ప్రవహించిన నీళ్లు ప్రస్తుతం రాళ్లు తేలి కాల్వలు వెలవెలబోతున్నాయి. దీంతో రిజర్వాయర్ పరిధిలోని ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడోదైన గుడిపల్లి రిజర్వాయర్ సామర్థ్యం 0.96టీఎంసీ మాత్రమే. అయితే ప్రాజెక్టు నీళ్లను నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తికి తరలించడంలో ఈ రిజర్వాయరే కీలకం. కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు(0.35టీఎంసీలు), సింగోటం శ్రీవారి సము ద్రం(0.55టీఎంసీలు), జొన్నలబొగుడ (2.14టీఎంసీలు)రిజర్వాయర్ల నుంచి నీళ్లు పొలాలకు మళ్లుతాయి. ఇలా ఎంజీకేఎల్ఐలో అత్యంత కీలకమైన గుడిపల్లి రిజర్వాయర్ ప్రస్తుతం చిన్న చెరువులా మారిపోయింది. గత వానకాలంలో వర్షాలు కురియక కృష్ణానదికి వరదలు రాలేదు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి చేరాయి. ఈ కారణంగా ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి దాదాపుగా మార్చి వరకు గుడిపల్లి రిజర్వాయర్ ద్వారా నీటి విడుదల కొనసాగింది.
ఎండాకాలంలోనూ చెరువుల్లో నీళ్లు మత్తడి దూకాయి. కానీ ఈ సారి గత డిసెంబర్ వరకు మాత్రమే ఈ రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత నీటి విడుదల నిలిచిపోయింది. అప్పటికే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంతో రైతులు సాగును తగ్గించుకున్నారు. జిల్లాలో గత సీజన్లో జిల్లాలో 3,12,096 ఎకరాల విస్తీర్ణంలో పంటల వేయగా, ఈ సారి 3,15, 919 ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 2,20,959ఎకరాల్లో మాత్రమే పంటల సాగు చేపట్టడం గమనార్హం. దీంతో లక్ష ఎకరాల విస్తీర్ణం తగ్గింది. జిల్లాలో భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. గతేడాది జనవరిలో దాదాపుగా 5.07మీటర్లలో భూగర్భ జలమట్టముండగా, ఈ ఏడాది జనవరిలో 8.64మీటర్లకు పడిపోయింది. దీనివల్ల రైతులు బోర్ల కింద సాగు చేపడుతున్నారు. చిన్న చెరువుల్లో నీటి శాతం బాగా తగ్గిపోయింది. ఎంజీకేఎల్ఐ ద్వారా 2017నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 550టీఎంసీల నీటిని జిల్లాకు ఎత్తిపోయడం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లా లో ప్రతి ఏడాది వానకాలం, యాసంగిలో దా దాపుగా 9లక్షల ఎకరాల్లో పంటల సాగు చేపడుతున్నారు. ఈసారి ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు తగ్గడంతో రైతన్నల్లో నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి.