కోడేరు, ఫిబ్రవరి 22 : సరైన వర్షాలు లేక కృష్ణానదిలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. సాగునీటి ప్రాజెక్టుల కింద యాసంగి పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఎంజీకేఎల్ఐ రెండో లిప్టు జొన్నల బొగుడ రిజర్వాయర్లో నీరు అడుగంటింది. సాగుకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. రిజర్వాయర్ సామర్థ్యం 2.14 టీఎంసీలు ఉండగా నేడు 0.5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నట్లు ఎంజీకేఎల్ఐ ఈఈ సంజీవరావు తెలిపారు.
గతేడాది పసుపుల, పాన్గల్ బ్రాంచి కెనాల్ ద్వారా కోడేరు , పాన్గల్ మండలాల్లో 34 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, జొన్నలబొగుడ రెండో తూం ద్వారా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ నుంచి కల్వకోలు వరకు 12 వేల ఎకరాలు కలిపి మొత్తం 46 వేల ఎకరాలకు సాగునీరు అందేలా కాల్వలను ఏర్పాటు చేశారు. అయితే ఈసారి రిజర్వాయర్లో నీళ్లు తగ్గిపోవడంతో కాల్వలు పారడం లేదు. పంటలు ఎండే పరిస్థితి దాపురించింది. కోడేరు మండలంలో ఈ యాసంగిలో 12వేల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈసారి యాసంగిలో కేవలం 5వేల వరకు పంటలు సాగు చేసినట్లు అధికారుల అంచనా..