నారాయణపేట టౌన్, జూన్ 13: ప్రభుత్వం మహిళల విద్యకు పెద్దపీట వేసిందని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని జీపీ శెట్టి ఫంక్షన్ హాల్లో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సంక్షేమంలో తెలంగాణ ముందుందని, జిల్లా అభివృద్ధిలో ప్రతి మహిళా ముందుకురావాలని కోరారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూళ్లను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రీ స్కూళ్లల్లో పిల్లలకు ప్రభుత్వం ఉచిత విద్య, ఇతర సదుపాయాలు కల్పించనుందన్నారు. జిల్లాలో ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు, సఖీ కేంద్రాలు, పోలీస్శాఖ ద్వారా షీ టీమ్స్ పని చేస్తున్నాయన్నారు. ప్రతినెలా ఎస్పీతో సమావేశాలు నిర్వహించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. అనాథ పిల్లలు, జోగినీ స్త్రీల పిల్లలను గురుకులాల్లో చేర్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం అన్ని దవాఖానల్లో సాధారణ కాన్పులు జరుగుతున్నట్లు చెప్పారు. జిల్లాకు మహిళా రుణాల కోసం రూ.144 కోట్లు మం జూరయ్యాయన్నారు. జిల్లాలోని మహిళా సం ఘాలకు రూ.10కోట్ల బ్యాంకు రుణాల చెక్కును అందజేశారు. అలాగే స్త్రీనిధి కింద మంజూరైన రూ.కోటి, కోయిల్కొండ మహిళా సంఘాల సభ్యులకు మంజూరైన రూ.24లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఉత్తమ మహిళలకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, పేట మార్కె ట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, కోయిల్కొండ ఎం పీపీ శశికళ, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపా ల్, బీసీ వెల్ఫేర్ అధికారి కృష్ణమాచారి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి కన్యాకుమారి పాల్గొన్నారు.