జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 12 : ‘చెత్తమ్మో.. చెత్త.. మీ ఇంటి వద్దకే చెత్తబండి వచ్చిందమ్మా.. తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి చెత్తబండిలో వేయండమ్మా’.. అంటూ నాలుగు నెలల వరకు జడ్చర్ల మున్సిపాలిటీలోని ప్రతి గల్లీలో నిత్యం వాహనాలు చెత్త సేకరించేవి. నేడు చాలా వరకు చెత్త వాహనాలు మరమ్మతులకు నోచుకోక మూలకు చేరాయి. వీధుల్లో తిరగాల్సిన బండ్లు పాడై పురపాలిక కార్యాలయం వద్ద తుప్పుపడుతున్నాయి. రెండేండ్ల కిందట రూ.24 లక్షల నిధులతో అదనంగా 3 ట్రాలీ ఆటోలు, 3 ట్రాక్టర్లను చెత్త సేకరణకు అధికారులు కొనుగోలు చేశారు. దీంతో మున్సిపాలిటీలోని 27 వార్డులకుగానూ ప్రస్తుతం చెత్తసేకరణ కోసం 17 ఆటోట్రాలీలు, 6 ట్రాక్టర్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 10 ఆటోలు, 6 ట్రాక్టర్లు మాత్రమే నిత్యం చెత్తను సేకరిస్తున్నాయి. మిగతావి రిపేర్కు గురయ్యాయి. వాహనాలు తక్కువగా ఉండడంతో పట్టణంలో రెండు, మూడ్రోజులకోసారి చెత్తను సేకరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పాతబజార్కు కేటాయించిన రెండు ఆటోలు చెడిపోవటంతో ఆ ప్రాంతంలో చెత్త రోడ్లపై వేస్తున్నారు. నేతాజీ కూడలి నుంచి సర్కారు దవాఖాన ప్రాంతంలో దుకాణదారులు సైతం చెత్తతో రోడ్లను నింపేస్తున్నారు. చెత్త బండ్లు చాలా కాలనీల్లోకి రాకపోవడంతో ప్రజలు వ్యర్థాలను రోడ్లపై వేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ.. అవగాహన కల్పిస్తూ నిత్యం ఇంటింటికీ చెత్తబండి వెళ్లేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సీన్ రివర్స్ అయ్యింది. వాహనాలు సరిపోను లేకపోవడంతో.. ఇప్పుడేమో చెత్తబండీ వచ్చేదెన్నడమ్మా.. చెత్త పారవేసేదెక్కడమ్మా ..అన్న చందంగా పరిస్థితి తయారైంది. కొంతకాలంగా పురవీధుల్లో తిరగాల్సిన బండ్లు పాడైపోయి పురపాలిక కార్యాలయం వద్ద ఓ మూలన పడ్డాయి.
జడ్చర్ల పట్టణంలో ఏడు చెత్త సేకరించే వాహనాలు రిపేర్కు గురయ్యాయి. వాటిని బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి ట్రాక్టర్లను తిప్పించి చెత్తసేకరిస్తున్నాం. రోజు తప్పించి రోజు చెత్తసేకరణకు బండ్లను తిప్పుతున్నాం. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి.