గద్వాల, డిసెంబర్ 4: కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా మీ ముందుంటానని, మన ప్రభుత్వం రాలేదని ఎవరూ అధైర్య పడవద్దని మీ అందరికీ అండగా ఉండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరుపేరున ధన్యవాదాలు చెప్పారు. ఈ గెలుపు ప్రజలేదని చెప్పారు. గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు సమన్వయం పాటించాలని, కాంగ్రెస్ నాయకులు మనల్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తారని అలాంటప్పుడు మనం మనో నిబ్బరంతో ఉండాలని సూచించారు. మనం శాంతియుతంగా గెలిచామని గద్వాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్దామని చెప్పారు. బీఆర్ఎస్ విజయం ప్రజలందరి విజయమని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసి గద్వాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాపై ఉందని చెప్పారు. కార్యకర్తలు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.