లింగాల, ఏప్రిల్ 29 : ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక జిల్లా సంచికలో సోమవారం వెలువడిన ‘మహాలక్ష్మికి ఎన్ని తిప్పలో’ శీర్షికన ఆర్టీసీ మహబూబ్నగర్ రీజనల్ మేనేజర్ శ్రీదేవి స్పందించారు. ఆదివారం మండలంలోని కోమటికుంట, మాడాపూర్ గ్రామాలకు చెందిన మహిళలు లింగాల సంతకు వెళ్లేందుకు స్టేజీ వద్ద వేచి ఉండగా బస్సులు ఆపకపోవడంతో ఆందోళనకు దిగిన మహిళలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి మాట్లాడుతూ హైదరాబాద్, లింగాలకు ప్రతిరోజూ 12బస్సులు నడుతున్నామన్నారు. పల్లె వెలుగు బస్సులకు మాత్రమే స్టాప్ ఉందని పేర్కొన్నారు. అయితే ఎక్స్ప్రెస్ బస్సులకు స్టాప్ లేకపోయినా, ప్రయాణికులు ఉంటే బస్సులు ఆపాలని ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్ఎం వెల్లడించారు.