నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ), నవంబర్ 19 : సీఎం కేసీఆర్ నాకు దైవసమానులు. కందనూలును సస్యశ్యామలం చేసి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం చాలా సంతో షం. కందనూలు ఒకప్పుడు కరువు జిల్లా. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంజీకేఎల్ఐ నీళ్లు తీసుకొచ్చాం. ప్రత్యేక జిల్లా, మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఇచ్చినమాట ప్రకారం మార్కండేయ లిఫ్టు ప్రారంభమైంది. ఐదు తండాలు, 17 గిరిజన తండాల్లో 8వేల ఎకరాలకు నీళ్లు ఇస్తుండటంతో నా జన్మ ధన్యమైంది. తెలంగాణ, కందనూలుపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ చెప్పలేనిది.
నన్ను మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల మధ్య నిలబెట్టారు. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా. జీవితం ఉన్నంత కాలం ప్రజల్లోనే ఉంటాను. నా చర్మాన్ని వదిలి ప్రజలకు చెప్పులు కుట్టిస్తూనే సేవ చేస్తాను. రైతుబిడ్డగా, కూలీ బిడ్డగా ప్రజల ఆశీర్వాదంతో ఎంతో సేవచేశా. కందనూలుకు మెడికల్ కాలేజీ ఇచ్చారు. ఇంజినీరింగ్ కాలేజీ కావాలి. వ్యవసాయం పెరిగినందున పరిశ్రమలు ఇవ్వాలి. దీంతో రైతులకు గిట్టుబాటు ధర వస్తది. రైతులు, కూలీలకు ఉపాధి దొరుకుతది. ఒక ఐటీ హబ్, పరిశ్రమలు మంజూరు చేయాలి. సీఎం కేసీఆర్కు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం. మా కుటుంబమంతా ప్రజల సేవలోనే ఉంటుంది.