మహబూబ్నగర్ అర్బన్, డిసెంబర్ 7 : భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలను ఆదుకున్న దేవుడు పండుగ సాయన్న అని మాజీమంత్రి డాక్టర్ వి శ్రీనివాస్గౌడ్ కీర్తించారు. ఆదివారం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద మాజీ మంత్రి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పండుగ సాయన్నకు సముచిత గౌరవం లభించిందని చెప్పారు.
బడుగుబలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి పండుగ సాయన్న అని కొనియాడారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరన్నపేటకు వచ్చినప్పుడు సాయన్న సమాధిని తొలిసారి సందర్శించి నివాళులర్పించామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన సమాధిని అభివృద్ధి చేశామన్నారు. సాయన్న వారసులను గుర్తించి డబుల్బెడ్రూం ఇండ్లను కేటాయించామన్నారు. భవిష్యత్ తరాలకు పండుగ సాయన్న చరిత్ర తెలియాలని తమ హయాంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రం లో ఆయన విగ్రహం ఏర్పాటు చేశామని వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ సీనియర్ నాయకులు బెక్కం జనార్దన్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, సీనియర్ నాయకులు అనంతరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సుధాకర్, అహ్మదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.