వనపర్తి టౌన్, జూన్ 23 : వనపర్తి జిల్లా క్రీడలకు ప్రసిద్ధి అని, అదే ఒరవడితో వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులకు సేవలందిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువరాం వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్పోర్ట్స్ డేను పురస్కరించుకొని క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడా రంగానికి సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సొంతంగా, ప్రభుత్వపరంగా వివిధ రంగాల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ విద్యారంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. చదువులో భాగంగా విద్యార్థులు ఆటలు ఆడి శారీరక దారుఢ్యం పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ దశల వారీగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారి వారి పుట్టిన రోజున అవకాశం ఉన్న ప్రతి చోట ఒక మొక్కను గుర్తుగా నాటాలని పిలుపునిచ్చారు. చిట్యాల తూర్పు తండాకు చెందిన శాంతకుమారి దేశం తరఫున ఆసియా క్రీడల్లో వాలీబాల్ పోటీలకు ప్రాతినిథ్యం వహిస్తుందని తెలిపారు.
ఆమెకు నా వేతనం నుంచి రూ.లక్ష సాయం అందించడంతోపాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించినట్లు చెప్పారు. అన్ని రంగాల క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పాఠశాలల ముఖచిత్రాలు మారనున్నాయని చెప్పారు. పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, క్రీడా మైదానాలు, విద్యుత్ సౌకర్యం, వంటగది, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
వనపర్తి జూనియర్ కళాశాల శిథిలావస్థకు చేరిందని, ఇదే మైదానంలో నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు త్వరలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రానున్నారని తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, జేసీ వేణుగోపాల్, నిర్వాహకులకు మెమెంటోలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ సంఘం ఉపాధ్యక్షుడు వాకిటి శ్రీధర్, కన్వీనర్ ప్రతాప్రెడ్డి, కో కన్వీనర్ సురేందర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, ఎస్జీఎఫ్ సెక్రటరీ సుధీర్కుమార్రెడ్డి, కో కన్వీనర్ కుమార్, రవీందర్రెడ్డి, జావెద్, సాగర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.