వనపర్తి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : దమ్ము చేయకుండా నేరుగా విత్తనాలు వెదజల్లే పద్ధతి ద్వారా వరిసాగుతో రైతులకు అధిక లాభాలు ఉన్నాయి. ఈ విధానంలో రైతులు వరిపంట పండిస్తే తక్కువ ఖర్చుతోపాటు అత్యధిక దిగుబడి సాధించే వీలుంది. దున్నడం దగ్గర నుంచి.. నాట్లు వేయడం వరకు రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని పం డించుకోవచ్చు. ప్రస్తుతం నాటు వేయడానికి కూలీలు దొరకని పరిస్థితి ఉంది. అలాగే కూలీరేట్లు రైతుకు భారంగా మా రుతున్నాయి. దీనివల్ల ఎకరాకు సుమారు రూ.5వేల వరకు ఖర్చులు తగ్గించుకోవచ్చని వ్యవసాయశాఖ చెబుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి జిల్లాలో ఈ విధానాన్ని ప్రొత్సహిస్తున్నారు. వర్షపుశాతం తక్కువగా ఉన్నప్పటికీ పంట పండించుకునే అవకాశముంది. విత్తనాలు కూడా ఎకరాకు 10కిలోల వరకు తగ్గుతాయి. పంట కూడా మామూలు వరిపంటతో పోల్చితే 10 రోజులు ముందుగా వస్తుంది. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ చెబుతున్నది.
నేల తయారీకి అనువైన రకాలు
వేసవి వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలాన్ని ఒకటి నుంచి రెండు మార్లు కల్టివేటర్తో దున్నాలి. అనంతరం విత్తనాలను విత్తుకోవాలి. నేలలో తేమ ఉన్నప్పుడే శుద్ధి చేసిన విత్తనాన్ని వరుసల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్ల మధ్య ఎడంగా నాటాలి. ఎరువు, విత్తనం ఒకేసారి వేసే సదుపాయం ఉన్న ఫెర్టి కమ్ సీడ్ డ్రిల్తో 6 నుంచి 8 సెంటీమీటర్ల దూరంలో 2.5 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. తొలకరి వర్షాలకు విత్తుకుంటే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో పడే వర్షాలు ఉపయోగపడుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో నీరు పెట్టాలి. పూత నుంచి గింజ గట్టి పడేవరకు ఒక అంగుళం నీరు నిల్వ ఉండేలా చూడాలి. వరికోతకు 15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం నిలిపివేయాలి.
జిల్లాకు అనువైన రకాలు, మోతాదు
దీర్ఘకాలిక రకాలు : సాంబమసూరి, సిద్ది
మధ్యకాలిక రకాలు : జగిత్యాల మసూరి, కృష్ణ, వరంగల్ వరి1
స్వల్పకాలిక రకాలు : తెలంగాణ సోనా, కూనారం వరి 1, జగిత్యాల వరి1, కాటన్దొర సన్నాలు, నెల్లూరి వరి
నాటుకునే సమయం : దీర్ఘకాలిక రకాలైతే జూన్ 30, మధ్య కాలిక రకాలైతే జూలై 15, స్వల్పకాలిక రకాలైతే జూలై 30, తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవడానికి జూన్ 10 నుంచి జూలై 10 లోపు నాటుకోవాలి. తెలంగాణ సోనా వరి రకాన్ని జూలై 10 తర్వాత నాటుకోవాలి.
విత్తన మోతాదు: సన్నరకాలు 8 నుంచి 10 కిలోలు, దొడ్డు రకాలు 10 నుంచి 12 కిలోలు.
ప్రయోజనాలివే..
విత్తన మోతాదు 10కిలోల వరకు ఆదా.
వానాకాలం వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
పొలం తయారీ ఖర్చులు తగ్గించుకోవచ్చు.
కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు.
సరైన సమయానికి విత్తుకోవడం.
పంట 7 నుంచి 10 రోజుల ముందే చేతికి రావడం.
సాగు సమస్యలు దూరం
విత్తనాలు వెదజల్లే పద్ధతి ద్వారా రైతులకు ఎంతో లాభాదాయ కం. గత సంవత్సరం రేవల్లిలో నాకు న్న 12 ఎకరాల పొలంలో వెదజల్లే పద్ధతి ద్వారా వరి సాగు చేశాం. మంచి ఫలితాలు వచ్చాయి. వ్యవసాయ అధికారుల సూచనలు, అనుభవజ్ఞులైన రైతుల సహకారంతోపాటు సొంత అనుభవం జోడించి విజయవంతంగా పంట తీశాం. ఈ సంవత్సరం మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నాను. దీని ద్వారా నాటువేసే కూలీల కోసం పడే ఇబ్బందులు తప్పుతాయి. నాటు వేసేందుకు ఇచ్చే మొత్తంలో మూడోవంతు మిగులుతుంది. ప్రస్తుత సీజన్లో 100 ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా వరి పండించడానికి ఇతర రైతులను కూడా ప్రోత్సహిస్తున్నాం.