వనపర్తి, జూన్ 23, (నమస్తే తెలంగాణ) : హరితోత్సవానికి పల్లెలు, పట్టణాలు సిద్ధం అవుతున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభంకానున్న ఏడోవిడుత హరితహారం కార్యక్రమానికి వనపర్తి జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి లో సమాయత్తమైంది. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమాల్లో 26,78,800 మొక్కలను నాటేందుకు నర్సరీల్లో సిద్ధంగా ఉంచారు. దీనిపై అధికారులతో కలెక్టర్ షేక్యాస్మిన్బాషా సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో రహదారులకు ఇరువైపులా యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటడంతోపాటు, కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణ, పరిసర ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన జిల్లాలో ఉంటుందన్న ప్రచారం సాగుతుండడంతో మున్సిపల్ కమిషనర్తోసహా ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఏడోవిడుత హరితహారం కోసం 40 శాఖలు తమ పరిధిలో విరివిగా మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి శాఖకూ మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో 15లక్షల మొక్కలు, డీపీవో 6లక్షలు, అటవీశాఖ లక్ష, వనపర్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యాయి. ఆత్మకూరు మున్సిపాలిటీ 40వేలు, కొత్తకోట, పెబ్బేరు మున్సిపాలిటీల్లో 50వేల చొప్పున మొక్కలు నాటనున్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 40వేల మొక్కలతోపాటు మిగతా శాఖలు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నిర్ణీత గడువులోగా నాటేందుకు సిద్ధమవుతున్నాయి.
హరితహారానికి ఏర్పాట్లు పూర్తి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడోవిడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మొత్తం జిల్లాలో 26,78,800 మొక్కలు నాటాలని నిర్ణయించాం. ఈ మేరకు శాఖలవారీగా టార్గెట్లు కేటాయించాం. డీఆర్డీఏ తరఫున 14 మండలాల్లో 15.20 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఉంది. మొక్కలు నాటేందుకు మండలాల్లో 3.59 లక్షల గుంతలు తవ్విస్తున్నాం.