అందుబాటులో 150 ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, మే 4: వనపర్తిలో రూ.కోటీ 16లక్షలతో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో వనపర్తిలో అందిస్తున్న సేవలు, వసతులపై మంత్రి నిరంజన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు, దవాఖాన సూపరింటెండెంట్ హరీశ్సాగర్, సంబంధిత వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా కరోనా సోకిన వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? వారికి చేస్తున్న సూచనలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీనగర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సెంటర్ను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అందుబాటులో 150 ఆక్సిజన్ బెడ్లు, 2 వెంటిలేటర్లు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ నేత మామిడిమాడ రంగారెడ్డి కుమారుడి సహాయంతో త్వరలో మరో వెంటిలేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. సెకండ్వేవ్లో 53,046మందికి పరీక్షలు నిర్వహించగా 6,384 మందికి పాటిజివ్ వచ్చిందని, 35 మంది మినహా అందరూ సురక్షితంగా ఉండగా ప్రస్తుతం 52మంది చికిత్స పొందుతున్నారన్నారు. 98శాతం మంది కరోనా నుంచి బయట పడుతున్నారని, కరోనా సోకిన వారు ఆందోళన చెందొద్దని మంత్రి చెప్పారు. జిల్లా దవాఖానలో అనస్తీషియా డాక్టర్ను ఏర్పాటు చేసుకునేందుకు ఆదేశాలిచ్చామన్నారు. ఈ రెండు నెలలకు అవసరమైన వైద్యులను వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుని వారు విధుల్లో చేరేలా చూసుకోవాలని, విధులకు రాని వారి స్థానంలో మరొకరిని నియమించుకోవాలన్నారు. గ్రామాల్లో 45 ఏండ్లు నిండిన వారంతా టీకా వేయించుకునేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ శ్రీధర్ పాల్గొన్నారు.
మైనార్టీలకు రంజాన్ కానుకలు
ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలోని ఈద్గా మసీద్ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు మంజూరు చేసిన గిఫ్ట్ ప్యాకెట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, తాసిల్దార్ రాజేందర్గౌడ్, కౌన్సిలర్ చీర్ల సత్యం, జిల్లా మైనార్టీ నేత జహంగీర్, మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు గులాంఖాదర్, ఇమ్రాన్ ఖాన్, నాయకులు రహీం పాల్గొన్నారు.
చింతల హనుమాన్ సన్నిధిలో..
వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ చింతల అభయాంజనేయ స్వామిని మంగళవారం మంత్రి నిరంజన్రెడ్డి దర్శించుకున్నారు. అంజన్నతోపాటు శివుడు, గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామి మాలధారణ స్వీకరించిన స్వాములు, మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్గౌడ్, శ్రీను, రాము, ఆంజనేయ స్వాములు కుమార్గౌడ్, బొజ్జిరెడ్డి, నిరంజన్, శంకర్, శ్రీను, రాము, చందు, విజయ్ పాల్గొన్నారు.