ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు
ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రక్రియ
నాగర్కర్నూల్/జడ్చర్ల/భూత్పూర్/ఊట్కూర్/అలంపూర్/అయిజ/వనపర్తి, మే 31 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు ఇతర లావాదేవీలను ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభించింది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించింది. లాక్డౌన్ నేపథ్యంలో రోజుకు 24 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మొదటి రోజు స్లాట్లు బుకింగ్ లేక రిజిస్ట్రేషన్లు కాలేదని రిజిస్ట్రార్ ఫయాజ్ పేర్కొన్నారు. జడ్చర్లలో ఆస్తులకు సంబంధించి మూడు స్లాట్లు బుక్ కాగా, ఇందులో రెండు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కు వచ్చాయని రిజిస్ట్రార్ ఆనంద్ తెలిపారు. భూములకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తాసిల్దార్ లక్ష్మీనారాయణ తెలిపారు. భూత్పూర్లో ఒక్క రిజిస్ట్రేషన్ అయినట్లు తాసిల్దార్ చెన్నకిష్టన్న తెలిపారు. దేవరకద్ర, అడ్డాకుల, మూసాపేట, చిన్నచింతకుంట మండలాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఐదు, ఊట్కూర్లో 2 రీషెడ్యూల్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులను అధికారులు పూర్తి చేశారు. నర్వ, మాగనూర్ మండలాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు కాలేదు. అలంపూర్ నియోజకవర్గంలో తొమ్మిది రిజిస్ట్రేషన్లు జరిగాయని తాసిల్దార్ మదన్మోహన్రావు తెలిపారు. గత నెల 12 నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తున్నట్లు అయిజ తాసిల్దార్ యాదగిరి తెలిపారు. అయిజ మండలంలో ఒక రిజిస్ట్రేషన్ పూర్తి చేశామన్నారు. వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఒక్క రిజిస్ట్రేషన్ అయినట్లు సబ్రిజిస్ట్రార్ రుషియాబదార్ తెలిపారు.