వనపర్తి జిల్లా ఖాన్ చెరువు వరకు కొత్తకాలువ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని కోసం రూ.18.66 కోట్లకు పరిపాలనా అనుమతులతో జీఓ 254 విడుదల చేసింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్యాకేజి 29 కింద సవాయిగూడెం, కిష్టగిరి, పెద్దగూడెం, దత్తాయిపల్లి, దావాజిపల్లి గ్రామాలలోని 5 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది.
కల్వకుర్తి ప్రధాన కాలువ (ప్యాకేజి 29) కింద డి8 డిస్ట్రిబ్యూటరీ కాలువలో భాగంగా నిర్మించిన ఎంజె 4 కాలువ పొడిగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వనపర్తి మండలంలోని పెద్దగూడెం ఖాన్ చెరువు వరకు 9.350 కిలోమీటర్ల నూతన కాలువ నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లకు ఆహ్వానం పలుకుతారని సమాచారం.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీపీఆర్ తయారు చేసినప్పుడు వనపర్తి, ఘణపురం, పెద్దమందడి మండలాలను చేర్చలేదు. అందువల్ల ఈ ప్రాంతానికి నీటి కేటాయింపులు జరగలేదు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో వనపర్తి, ఘణపురం, పెద్దమందడి, గోపాల్ పేట, రేవల్లి మండలాలను కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు.
దాని ఫలితంగానే ఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఘణపురం మండలానికి, బుద్దారం బ్రాంచ్ కెనాల్ ద్వారా పెద్దమందడి మండలానికి, డిస్ట్రిబ్యూటరీ 5 ద్వారా రేవల్లి మండలానికి, డిస్ట్రిబ్యూటరీ 8 ద్వారా గోపాల్ పేట, వనపర్తి మండలాలకు సాగునీరు అందించడం జరుగుతున్నది. గతంలో ఎంజె 4 కాలువను గోప్లాపూర్, దావాజి పల్లి వరకు తవ్వి వదిలేశారు. వనపర్తి మండలానికి సాగునీరు తేవాలని కాలువ పొడవును 16.40 కిలోమీటరు నుండి మరో 9.350 కిలోమీటర్లు పెంచనున్నారు.
కొత్త కాలువ ద్వారా మరో 5 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుండడంతో పాటు దాదాపు 10 చెరువులకు సాగునీరు అందనున్నది. తాజా ఉత్తర్వులతో వనపర్తి మండలం మొత్తం సాగునీటితో సస్యశ్యామలం కానున్నది. నూతన కాలువ నిర్మాణానికి రూ.18.66 కోట్లకు అనుమతి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.