వనపర్తి వేదికగా సీఎం కేసీఆర్ తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో మార్చి 9న బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువ సోదరుల కోసం ప్రకటన చేయబోతున్నట్టు వెల్లడించారు. నిరుద్యోగ సోదరులంతా రేపు పొద్దున 10 గంటలకు టీవీలు చూడండి. ఏం ప్రకటన చేయబోతున్నామో చూడండి.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అణువణువున తెలంగాణ జీర్ణించుకున్న రక్తంలో తెలంగాణ కోసం చివరి ఊపిరి దాకా.. చివరి బొట్టు దాకా తెలంగాణ ప్రగతి కోసమే తప్ప టీఆర్ఎస్ వేరే పని చేయదని సీఎం కేసీఆర్ తెలిపారు.
దళిత బిడ్డల కోసం ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా.. 10 లక్షలు ఇవాళ దళిత కుటుంబానికి ఇస్తున్నాం. తిరిగి ఇచ్చేది లేదు. కిస్తీ కట్టేది లేదు. బ్యాంక్ లింకేజ్ లేదు. వడ్డీ లేదు.. వాళ్లకు నచ్చిన పని. వచ్చిన పని చేసుకొని అద్భుతంగా ముందుకు పోవాలి. తెలంగాణ తెచ్చుకొని ఎలాగైతే మనం కరెంట్, మంచినీళ్లు అన్నీ తెచ్చుకున్నమో.. మన దళిత బిడ్డలు కూడా అలాగే బాగు కావాలి. దళిత బంధు..ఇతర అన్ని వర్గాల వారు కూడా దళిత బిడ్డలకు అండగా ఉండాలి. భారతదేశమే మన దగ్గర నుంచి నేర్చుకోవాలి.. అని సీఎం వెల్లడించారు.